Uttam : అత్యాధునిక సాంకేతికతతో ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వుతాం
ABN , Publish Date - Jun 07 , 2025 | 03:55 AM
ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు.

ఉమ్మడి నల్లగొండలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
సన్న బియ్యంతో 80% ప్రజలకు కడుపు నిండా అన్నం
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
యాదాద్రి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. సన్న బియ్యం ద్వారా 80 శాతం ప్రజలకు కడుపు నిండా అన్నం పెడుతున్నామన్నారు. దశాబ్ద కాలంగా పెండింగులో ఉన్న గంధమళ్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను రూ.574 కోట్లతో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఎక్కువ గ్రామాలు ముంపునకు గురికాకుండా రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.4టీఎంసీలకు తగ్గించి, 60వేల ఎకరాలకు నీరు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ, డిండిప్రాజెక్టులతో పాటు కృష్ణా నదిపై ఎత్తిపోతల పథకాలను చేపట్టలేదని, తమ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. ఎత్తిపోతల పథకాల కింద భూసేకరణ బాధ్యతను సంబంధిత శాసనసభ్యులు తీసుకోవాలన్నారు. రూ.1,800కోట్లతో ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టును మొదలుపెట్టబోతున్నామని, తమ హయాంలోనే పూర్తిచేస్తామని మంత్రి తెలిపారు.
చెప్పనివీ చేస్తున్నాం: కోమటిరెడ్డి
తాము ఇచ్చిన వాగ్దానాలే కాకుండా, ఇవ్వని వాటిని కూడా నెరవేరుస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు. ఆలేరు నియోజకవర్గంలో మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికీ మంచినీరు ఇవ్వనున్నామని, యాదగిరిగుట్ట మునిసిపాలిటీలో తాగునీటితో పాటు ఇళ్లు, డ్రైనేజీలు కట్టిస్తామని తెలిపారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఏఎమ్మార్పీ కింద మిగిలిపోయిన 10కిలోమీటర్ల ఉప కాలువ పనులను పూర్తి చేయాలని కోరారు. తుర్కపల్లికి పారిశ్రామిక పార్కు మంజూరు చేయాలని, గుండాల కాల్వ పనులకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు.