తడిసిన ధాన్యాన్నీ కొంటాం రైతులకు అండగా ఉంటాం
ABN , Publish Date - May 17 , 2025 | 03:26 AM
రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నందున తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇప్పటిదాకా 50 లక్షల టన్నులు కొన్నాం
కొనుగోళ్లపై తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ఉత్తమ్
పాల్గొన్న తుమ్మల, పొన్నం, కోమటిరెడ్డి
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నందున తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. ధాన్యం కొనుగోలు పురోగతిపై శుక్రవారం ఆయన సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్ చౌహాన్, డైరెక్టర్ ప్రసాద్తో పాటు మార్కెటింగ్, వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు. యాసంగి సీజన్లో ఇప్పటి వరకు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 60.14 లక్షల ఎకరాలు సాగు చేయగా ధాన్యం దిగుబడి అంచనా 130 లక్షల టన్నుల వరకు ఉంటుందన్నారు. 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలిపారు. 2022-23 రబీ సీజన్లో మే 15 నాటికి 25.35 లక్షల టన్నులు కొనుగోలు చేయగా.. 2023-24లో అదే సమయానికి 32.93 లక్షల టన్నులు కొన్నామని.. ఈ ఏడాదిలో 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు.
పెరిగిన ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా 8,348 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత రబీ సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో అదనంగా 1,311 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం కొనుగోలులో రానున్న 10-12 రోజులు కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉత్తమ్ సూచించారు. ఇప్పటికే 71 శాతం మేర కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ధాన్యం కొనుగోలుపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నివారించేలా చర్యలు చేపట్టి, రైతులకు భరోసా కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాన్ని అడ్డుకొని, ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలని కలెక్టర్లకు సూచించారు. తెల్ల రేషన్ కార్డుల అంశంపై స్పందిస్తూ.. అర్హులైన వారి దరఖాస్తుల పరిశీలన తుది దశకు చేరిందని ఉత్తమ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News