Sridhar Babu: మీసేవలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లు
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:48 AM
మీసేవల్లో రెండు కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక నుంచి మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లను మీసేవ ద్వారా పొందవచ్చు.

కొత్త సేవలను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): మీసేవల్లో రెండు కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక నుంచి మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లను మీసేవ ద్వారా పొందవచ్చు. ఈసేవలు తక్షణం అమల్లోకి వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన ఈ సేవలను ఆవిష్కరించారు. పౌరులకు మరింత వేగంగా, పారదర్శక సేవలను అందించాలన్న లక్ష్యంతోనే కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కొత్త సేవలతో ప్రజలు సంబంధిత కార్యాలయాలకు వెళ్లకుండానే మీసేవ ద్వారా మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లను పొందవచ్చన్నారు.
మార్కెట్ వాల్యూ సేవ..
మీసేవ సెంటర్ లేదా ఆన్లైన్లో జిల్లా, గ్రామం వంటి వివరాలను సమర్పించి భూమికి సంబంధించిన తాజా మార్కెట్ విలువను పొందవచ్చు. ఈ దరఖాస్తులను సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం త్వరితగతిన పరిశీలించి నిర్ణయిస్తుంది.
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
ఇందులో స్లాట్ బుకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దరఖాస్తుదారులు పెళ్లి ఫొటోలు, చిరునామా రుజువు, వయస్సు ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. ఆమోదం అనంతరం సర్టిఫికెట్ను ప్రత్యక్షంగా సబ్-రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి జారీ చేస్తారు.