Share News

Yadagirigutta: యాదగిరీశుడి క్షేత్రంలో అపశ్రుతి

ABN , Publish Date - May 26 , 2025 | 04:00 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల్లో ఆదివారం వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతిచెందారు.

Yadagirigutta: యాదగిరీశుడి క్షేత్రంలో అపశ్రుతి

  • వేర్వేరు ఘటనల్లో ఇద్దరు భక్తుల మృతి

  • తేనెటీగల దాడిలో కొందరు భక్తులకు గాయాలు

యాదాద్రి, మే 25 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల్లో ఆదివారం వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతిచెందారు. కుటుంబసభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన రామసాహు(60) కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. లక్ష్మీనృసింహుడిని దర్శించుకునేందుకు కుటుంబంతో కలిసి ఆయన యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చారు. క్యూలైన్లో వేచిఉన్న రామసాహు ఒక్కసారిగా అస్వస్థతకు గురై.. స్పృహ కోల్పోయారు. వెంటనే కొండపైనే ఉన్న ఆస్పత్రికి ఆయన్ను తరలించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం అంబులెన్స్‌లో భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మరో ఘటనలో.. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం.. గుట్ట కింద గల లక్ష్మీపుష్కరిణిలో స్నానం చేస్తుండగా ఆవీర్‌ అనే ఏడేళ్ల బాలిక ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగింది.


కొద్దిసేపటికి చిన్నారిని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను బయటకు తీశారు. హుటాహుటిన బాలికను తొలుత యాదగిరిగుట్టలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే బాలిక మృతి చెందినట్లు చెప్పారు. అదేరోజు గుట్ట వద్ద భక్తుల్లో కొందరిపై తేనెటీగలు దాడి చేశాయి. కొందరు భక్తులు ఓ చెట్టు కింద కూర్చోగా తేనెటీగలు రావడంతో వారంతా తలోదిక్కున పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో హైదరాబాద్‌ అంబర్‌పేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన యాదగిరి, పుష్పలత, శ్రావణి, అరవింద్‌, రుత్విక్‌ గాయపడ్డారు. వారిని వెంటనే భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.కాగా ఆదివారం కావడంతో యాదగిరిగుట్టకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కొండపైన, కింద పార్కింగ్‌ ప్రదేశాలు నిండిపోయాయి. ఆదివారం 67వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.74,33,486 ఆదాయం సమకూరిందని ఈవో వెంకట్రావు తెలిపారు.


ఇవి కూడా చదవండి

Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్

ponnam prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం

Updated Date - May 26 , 2025 | 04:00 AM