Share News

TPCC New Committee 2025: పీసీసీ పదవుల్లోనూ సామాజిక న్యాయం

ABN , Publish Date - Jun 10 , 2025 | 05:51 AM

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతుల్యత పాటించిన కాంగ్రెస్‌ పార్టీ.. టీపీసీసీ పదవుల్లోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. మహిళలకూ తగిన ప్రాధాన్యం కల్పించింది. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులతో పీసీసీ కార్యవర్గాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది.

TPCC New Committee 2025: పీసీసీ పదవుల్లోనూ సామాజిక న్యాయం

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట

  • 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులతో పీసీసీ కార్యవర్గం

  • గతం కన్నా సంఖ్య తగ్గినా.. జంబో టీమే

  • ఉపాధ్యక్షుల్లో 67శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు.. ప్రధాన కార్యదర్శుల్లోనూ 68 శాతం

  • ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ చోటు

  • 20 ఏళ్లకు పైగా పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతుల్యత పాటించిన కాంగ్రెస్‌ పార్టీ.. టీపీసీసీ పదవుల్లోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. మహిళలకూ తగిన ప్రాధాన్యం కల్పించింది. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులతో పీసీసీ కార్యవర్గాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. గత కార్యవర్గంతో పోలిస్తే.. సంఖ్య కొంత తగ్గినా మరోసారి జంబో టీమ్‌నే ఏర్పాటు చేసింది. ఆ వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌ సోమవారం రాత్రి వెల్లడించారు. 27 మంది ఉపాధ్యక్షుల్లో ఎనిమిది మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ముగ్గురు ముస్లింలకు అవకాశం కల్పించారు. అంటే ఉపాధ్యక్ష పదవుల్లో ఈవర్గాలకు 67 శాతం దక్కాయి. ఇక 69 ప్రధాన కార్యదర్శి పదవుల్లో బీసీలకు అత్యధికంగా 26 మందికి అవకాశం కల్పించారు. తొమ్మిది మంది ఎస్సీలు, నలుగురు ఎస్టీలు, ఎనిమిది మంది ముస్లింలను నియమించారు. మొత్తంగా ప్రధాన కార్యదర్శి పదవుల్లో ఈ వర్గాలన్నింటికీ కలిపి 68 శాతం దక్కాయి. కాగా, పార్టీలో సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి, విధేయులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇరవై ఏళ్లకు పైగా కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణ, చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తున్న సీనియర్‌ నేతలకు అవకాశమిచ్చారు. యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐలో పనిచేసిన వారికీ కార్యవర్గంలో చోటు దక్కింది.


ఎక్కువ మందిని ప్రతిపాదించినా..

వాస్తవానికి రాష్ట్ర నాయకత్వం మరింత ఎక్కువ మందితో జాబితాను ప్రతిపాదించింది. 40 మంది ఉపాధ్యక్షులు, 85 మంది ప్రధాన కార్యదర్శులతో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలంటూ టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధిష్ఠానానికి ప్రతిపాదించారు. ముఖ్యనేతలతో సంప్రదింపుల తర్వాతే ఈ ప్రతిపాదిత జాబితా రూపొందించి పంపారు. పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎక్కువ మందికి పదవుల్లో అవకాశాన్ని ఇవ్వడానికి వీలుగా తమ ప్రతిపాదనను ఆమోదించాలని మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు సీఎం రేవంత్‌రెడ్డి కూడా పలుమార్లు అధిష్ఠానం పెద్దలను కోరారు. పాత కార్యవర్గంలో సీనియర్‌ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు కలుపుకొని 35 మంది ఉన్నారని, ప్రధాన కార్యదర్శులు 86 మంది ఉన్నారని గుర్తు చేశారు. అయితే ఈ ప్రతిపాదనను అధిష్ఠానం ఆమోదించలేదు. జాబితాను కుదించాల్సిందిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించడంతో సంఖ్యను తగ్గించారు. కాగా, ఈసారి ఉపాధ్యక్షుల్లో ఒక ఎంపీ, ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చోటు కల్పించారు. ప్రధాన కార్యదర్శుల్లో ముగ్గురు ఎమ్మెల్సీలకు చోటు దక్కింది. ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్‌, బసవరాజు సారయ్యలకు ఉపాధ్యక్ష పదవులు వరించింది.


టీపీసీసీ ఉపాధ్యక్షులు వీరే..

టి.కుమార్‌ రావు, కె.రఘువీర్‌రెడ్డి(ఎంపీ), నాయిని రాజేందర్‌రెడ్డి(ఎమ్మెల్యే), చిక్కుడు వంశీకృష్ణ(ఎమ్మెల్యే), బల్మూరి వెంకట్‌(ఎమ్మెల్సీ), బసవరాజు సారయ్య(ఎమ్మెల్సీ), హనుమండ్ల ఝాన్సీరెడ్డి, బండి రమేశ్‌, కొండ్రు పుష్పలీల, కోట నీలిమ, బి.కైలాష్‌ కుమార్‌, నమిండ్ల శ్రీనివాస్‌, ఆత్రం సుగుణ, గాలి అనిల్‌కుమార్‌, చిట్ల సత్యనారాయణ, లకావత్‌ ధన్వంతి, ఎం.వేణుగౌడ్‌, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, కొండేటి మల్లయ్య, ఎం.ఏ.ఫహీమ్‌ (సంగారెడ్డి), ఎస్‌.సురేశ్‌కుమార్‌, బొంతు రామ్మోహన్‌, అఫ్సర్‌ యూసుఫ్‌ జాహీ, ఎస్‌.జగదీశ్వర్‌రావు, నవాబ్‌ ముజాహిద్‌ ఆలంఖాన్‌, గుమ్ముల మోహన్‌రెడ్డి, చిన్నపటాల సంగమేశ్వర్‌.

టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు..

వెడ్మ బొజ్జు(ఎమ్మెల్యే), సీహెచ్‌ పర్ణికారెడ్డి(ఎమ్మెల్యే), మట్టా రాగమయి(ఎమ్మెల్యే), సీహెచ్‌.రాంభూపాల్‌, సంజీవ్‌ ముదిరాజ్‌, బొజ్జా సంధ్యారెడ్డి, మల్లాది రాంరెడ్డి, అబ్దేశి సదాలక్ష్మి, ఎం.బేబి స్వర్ణ కుమారి, దారాసింగ్‌ తాండూరు, జి.శశికళా యాదవరెడ్డి, కత్తి వెంకటస్వామి, ముహమ్మద్‌ అబ్దుల్‌ ఫహీమ్‌, సంతోష్ కుమార్‌ రుద్ర, దుర్గం భాస్కర్‌, ముహమ్మద్‌ ఖాజా ఫఖ్రుద్దీన్‌, వి.జగదీశ్వర్‌గౌడ్‌, నరేశ్‌ జాదవ్‌, అల్లం భాస్కర్‌, గిరిజా షెట్కార్‌, కొప్పుల ప్రవీణ్‌కుమార్‌, ఎ.జంగారెడ్డి, కస్బా శ్రీనివాస్‌రావు, దుద్దిళ్ల శ్రీనివాస్‌, బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, చనగాని దయాకర్‌, పీసరి మహిపాల్‌రెడ్డి, గజ్జెల కాంతం, ఈడుపుగంటి సుబ్బారావు, చకిలం రాజేశ్వరరావు, ఈర్ల కొమరయ్య, ఏ.రవిబాబు, నాగ సీతారాములు, ఎస్‌.శ్రీనివాస్‌ గౌడ్‌, పృథ్వీచౌదరి వేణుల, అంబడి రాజేశ్వర్‌, డి.డి.వెంకట్‌రాజ్‌, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పల్లె శ్రీనివాస్‌గౌడ్‌, మొహమ్మద్‌ సబీర్‌ అలీ, కట్ల రంగారావు, పి.శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సత్యనారాయణగౌడ్‌, టి.అనంతకిషన్‌, వి.రామారావుగౌడ్‌, అచ్యుత్‌ రమే్‌షబాబు, పెద్దనోల్ల బాలమురళీకృష్ణ (చిన్నా), ఎం.రాజీవ్‌రెడ్డి, ఆదం రాజ్‌ దేకపాటి, షమీం ఆఘా, ఇ.వి.శ్రీనివా్‌సరావు, మిథున్‌రెడ్డి, ఎ.వెంకటేశ్‌ పవార్‌, రాయగిరి కల్పనాయాదవ్‌, రాజేష్‌ కాశిపాక, రహమత్‌ హుస్సేన్‌, పి.ప్రసన్నకుమార్‌ శర్మ, ముహమ్మద్‌ అసదుద్దీన్‌, నందిమల్ల యాదయ్యముదిరాజ్‌, దైద రవీందర్‌, ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, జి.నాగభూషణం, ఉపేందర్‌రెడ్డి, ధర్మారావు, నూతి సత్యనారాయణగౌడ్‌, దుర్గాప్రసాద్‌, సి.వెంకటగోవిందరావు, పెండ్లి శ్రీనివాసులురెడ్డి.


పెండింగ్‌లో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవులు..

టీపీసీసీ కమిటీలు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ప్రకటించిన ఏఐసీసీ.. కార్యనిర్వాహక అధ్యక్ష పదవులను మాత్రం ఇంకా పెండింగ్‌లోనే పెట్టింది. రెడ్డి, ఎస్సీ మాదిగ, ఎస్టీ లంబాడా, ముస్లిం మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున ఇవ్వాలని నిర్ణయం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రతిపాదిత పేర్లపై ఏకాభిప్రాయం రాకపోవడంతో పక్కన పెట్టింది. అలాగే పలు టీపీసీసీ కమిటీలపైనా అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది

Updated Date - Jun 10 , 2025 | 05:53 AM