Minister Komatireddy: టిమ్స్ పనుల నాణ్యతలో రాజీపడొద్దు
ABN , Publish Date - May 14 , 2025 | 03:44 AM
టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో నాణ్యతతో రాజీపడకూడదని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. పనుల్లో ఆలస్యం చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలసత్వం వహిస్తే చర్యలు: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సూచించారు. పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల పురోగతిపై ఆయన రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సమీక్షించారు. హాస్పిటల్ నిర్మాణం త్వరగా పూర్తయితే పేదలకు వైద్య ఖర్చుల నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. సూపర్ స్పెషాలిటీ హంగులు, అధునాతన వైద్య పరికరాలతో పాటు ఆధునిక ఆపరేషన్ థియేటర్లు నిర్మాణం, ఇ- సూపర్ స్పెషాలిటీ సామగ్రి అంతా బయట దేశాలనుంచి రావాల్సి ఉండటం వల్ల టిమ్స్ నిర్మాణంలో కొంత ఆలస్యం జరుగుతుందని అంచనా వేశారు. ఉస్మానియా ఆస్పత్రి పునర్మిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని తెలిపారు. సనత్ నగర్ హాస్పిటల్ పనులు ఆగస్టు నెలాఖరు వరకు పూర్తిచేస్తామని చెప్పారు. ఎల్బీనగర్, అల్వాల్ హాస్పిటల్స్ను వీలైనంత తొందరలో నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభించనున్నట్లు చెప్పారు.