Share News

Uttam: గోదావరి బనకచర్ల అనుసంధానం అడ్డుకుంటాం

ABN , Publish Date - Jun 07 , 2025 | 03:09 AM

ఆంధ్రప్రదేశ్‌ తలపెట్టిన గోదావరి- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకుంటామని, నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం ఎక్కడిదాకైనా వెళతామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Uttam: గోదావరి బనకచర్ల అనుసంధానం అడ్డుకుంటాం

  • కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖలకు లేఖలు రాశాం

  • బచావత్‌ ప్రకారమే వెళ్తామని కేంద్రం బదులిచ్చింది

  • జలాల్లో న్యాయమైన వాటాకు ఎక్కడిదాకైనా వెళ్తాం

  • కృష్ణా జలాల్లో బీఆర్‌ఎస్‌ హయాంలోనే అన్యాయం

  • విలేకరులతో ఉత్తమ్‌ చిట్‌చాట్‌.. జోసెఫ్‌ గోబెల్స్‌ రావుగా

  • పేరు మార్చుకోవాలని పరోక్షంగా హరీశ్‌కు చురకలు

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ తలపెట్టిన గోదావరి- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకుంటామని, నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం ఎక్కడిదాకైనా వెళతామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని ఆరోపించారు. కానీ, ఆ పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని చూసి జోసెఫ్‌ గోబెల్స్‌ కూడా సిగ్గుపడతారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో చిట్‌చాట్‌ చేశారు. గోదావరి - బనకచర్ల అనుసంధానినికి వ్యతిరేకంగా కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖతోపాటు గోదావరి నది యాజమాన్య బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీలకు పలుమార్లు లేఖలు రాశామని చెప్పారు. గోదావరి - కృష్ణా బేసిన్‌లో కొత్తగా ఏ ప్రాజెక్టును చేపట్టాలన్నా ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను గోదావరి, కృష్ణా బోర్డులు పరిశీలించాలని, కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ), అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం తప్పనిసరి అని కేంద్రానికి లేఖల ద్వారా తెలియజేశామని తెలిపారు. ‘ తెలంగాణ విజ్ఞప్తిని పరిశీలిస్తున్నామని, బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారమే గోదావరి- బనకచర్ల అనుసంధానంపై వ్యవహరిస్తాం’ అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ బదులు కూడా ఇచ్చారని ఉత్తమ్‌ చెప్పారు.


ఈ విషయంలో కేంద్రం ఏపీకి అనుకూలంగా.. చట్ట వ్యతిరేకంగా పని చేయదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి హక్కులకు భంగం కలగకుండా గోదావరి-బనకచర్ల అంశంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఉత్తమ్‌ కోరారు. ఇక, కృష్ణా జలాల అంశంలో బీఆర్‌ఎస్‌ హయాంలోనే రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్‌ ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004-14 దాకా శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు 727 టీఎంసీల కృష్ణా జలాలను ఏపీ తరలించిందని, అదే 2014-23 దాకా 1201 టీఎంసీలను తరలించిందని ఉత్తమ్‌ అన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కలిగిన మేలు ఏమీ లేదని తెలిపారు. ఆ లక్ష కోట్లలో రూ.38 వేల కోట్లను ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలోని తుమ్మిడిహెట్టి బ్యారేజీపై, రూ.60 వేల కోట్లను కృష్ణా ప్రాజెక్టులపై పెట్టి ఉంటే 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందేదని ఉత్తమ్‌ అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయిస్తే... అందులో 512 టీఎంసీలు ఏపీ తరలించడానికి, 299 టీఎంసీలు తెలంగాణకు చాలనే ఒప్పందాలపై బీఆర్‌ఎస్‌ హయాంలో సంతకాలు చేశారని తెలిపారు. ప్రస్తుతం తాము 811 టీఎంసీల్లో 700 టీఎంసీలను రాష్ట్రానికి కేటాయించాలని కోరుతున్నామని చెప్పారు. ట్రైబ్యునల్‌ చరిత్రలోనే నీటి కేటాయింపుల విచారణకు హాజరైన ఏకైక నీటి పారుదల శాఖ మంత్రి తానేనని ఉత్తమ్‌ వెల్లడించారు.


2014లో చేసుకున్న కృష్ణా జలాల పంపిణీ ఒప్పందం 2023 దాకా కొనసాగిందన్నారు. 2014 దాకా శ్రీశైలం నుంచి రోజుకు 47 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తరలించే సామర్థ్యం కలిగిన ఏపీ 2023 నాటికి అది 1,11,400 క్యూసెక్కులకు చేరేలా పనులు చేసిందని తెలిపారు. ఇందుకోసం పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల సామర్థ్యాలను పెంచిందని వివరించారు. అలాగే, 2014కు ముందు శ్రీశైలం నుంచి రోజుకు 4.1 టీఎంసీలు మాత్రమే తరలించగా, బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు 2023 దాకా రోజుకు 9.6 టీఎంసీల నీటిని తరలించే సామర్థ్యాన్ని ఏపీ పెంచుకుందని చెప్పారు. ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2020 మే 5న జీవో జారీ చేస్తే... ఆ పథకం టెండర్లు పిలిచే దాకా అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం హాజరుకాలేదని తెలిపారు. 2020 ఆగస్టు 5న జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతూ 2020 జూలై 30న కేసీఆర్‌ లేఖ రాశారని ఉత్తమ్‌ గుర్తు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లన్నీ పూర్తయ్యాక 2020 అక్టోబరు 20న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగిందన్నారు. వర్కింగ్‌ అరేంజ్‌మెంట్‌ పేరుతో కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోవడానికి అవసరమైన సహకారం బీఆర్‌ఎస్‌ ఇచ్చిందని వివరించారు. కానీ, అసత్యాలు ప్రచారం చేయడంలో బీఆర్‌ఎస్‌ నేతలు ముందున్నారని, ఆ ప్రచారాన్ని చూస్తే జోసెఫ్‌ గోబెల్స్‌ కూడా సిగ్గుపడేవారని ఉత్తమ్‌ అన్నారు. జోసెఫ్‌ గోబెల్స్‌ రావుగా పేరు మార్చుకోవాలని పరోక్షంగా హరీశ్‌ రావుకు చురకలంటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోపై దాడి.. స్వల్ప గాయాలు

బనకచర్లపై ఘాటుగా స్పందించిన మంత్రి ఉత్తమ్

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 03:09 AM