Tummala: కేంద్రం పూర్తిస్థాయిలో ఎరువులను సరఫరా చేయడం లేదు
ABN , Publish Date - Jun 07 , 2025 | 04:05 AM
మూడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎరువులను పూర్తి స్థాయిలో అందించడం లేదని, ఈ విషయంపై 9న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు.

ఈ నెల 9న కేంద్ర మంత్రిని కలుస్తాం: తుమ్మల
సాగులో విప్లవాత్మక మార్పు కోసమే కిసాన్ మేళా: పొన్నం
హుస్నాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): మూడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎరువులను పూర్తి స్థాయిలో అందించడం లేదని, ఈ విషయంపై 9న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. అయినా రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా ముందే బఫర్ స్టాక్ పెట్టుకున్నామని చెప్పారు. ఈ వరినాట్లకు ముందే భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవాన్ని (కిసాన్మేళా) ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పంటల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వానికి యేటా రూ. వెయ్యి నుంచి రెండు వేల కోట్లు నష్టం వస్తున్నా రైతులను ఆదుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని చెప్పారు. రైతాంగాన్ని ప్రభుత్వం, ప్రతిపక్షాలు కన్నకొడుకుల్లా చూసుకోవాలని హితవు పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకే కిసాన్ మేళా ఏర్పాటు చేశామన్నారు. సీఎం రేవంత్రెడ్డి రైతాంగం సంతోషంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో పని చేస్తున్నారని తెలిపారు.