Share News

Sridhar Babu: ప్రపంచ నైపుణ్య రాజధానిగా తెలంగాణ

ABN , Publish Date - Jun 12 , 2025 | 03:49 AM

తెలంగాణను ‘ప్రపంచ నైపుణ్య రాజధాని’గా మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

Sridhar Babu: ప్రపంచ నైపుణ్య రాజధానిగా తెలంగాణ

  • సెమీ కండక్టర్ల తయారీ.. డిజైనింగ్‌లో 10 వేల మంది యువతకు శిక్షణ

  • 2030కల్లా శిక్షణ పూర్తికి.. స్ర్పింగ్‌ సెమీ కండక్టర్స్‌ అంగీకారం: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను ‘ప్రపంచ నైపుణ్య రాజధాని’గా మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న యూకేకు చెందిన సెమీ కండక్టర్‌ దిగ్గజ సంస్థ ‘ఆర్మ్‌ హోల్డింగ్స్‌’ ప్రతినిధులతో బుధవారం ఆయన సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలు, పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను గురించి సంస్థ ప్రతినిధులకు వివరించారు. సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్‌లో దిగ్గజ సంస్థగా ఉన్న ఆర్మ్‌ హోల్డింగ్స్‌ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ‘తెలంగాణ రైజింగ్‌’లో భాగస్వామ్యయ్యేందుకు ముందుకొచ్చినందుకు ఆ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


తెలంగాణకు యువతే పెద్ద ఆస్తి అని.. వారిలో ప్రతిభకు కొదువలేదని, కొంచెం సానబెడితే మెరికల్లా తయారవుతారని వివరించారు. మలేసియాకు చెందిన ‘స్ర్పింగ్‌ సెమీ కండక్టర్స్‌’ సీఈవోతోనూ మంత్రి సమావేశమయ్యారు. ‘‘సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్‌లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా తెలంగాణ యువతను తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలన్నది మా ఆకాంక్ష. 10 వేల మంది యువత శిక్షణనిచ్చే బాధ్యతను తీసుకోవాలి’’ అని స్ర్పింగ్‌ సెమీ కండక్టర్స్‌ సీఈవో కెన్‌కూను మంత్రి కోరారు. దానికి కెన్‌ స్పందిస్తూ.. ఇక్కడి యువతను సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్‌లో అత్యుత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక కరికులమ్‌ను రూపొందిస్తామన్నారు. విద్యాసంస్థల సహకారంతో ఆర్నెల్లపాటు ఇక్కడే శిక్షణనిస్తామని, ఆ తర్వాత తైవాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌ తదితర దేశాల్లో ఇంటర్న్‌షి్‌పనకు అవకాశం కల్పిస్తామన్నారు. 2030 నాటికి 10వేల మంది యువతకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామని వివరించారు. కార్యక్రమంలో టీ-కన్సల్ట్‌ చైర్మన్‌ సందీప్‌ కుమార్‌ మక్తాలా, వరల్డ్‌ తెలుగు ఐటీ కౌన్సిల్‌ మలేసియా విభాగం అధ్యక్షుడు మారుతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 03:49 AM