Suryapet police: అంతర్రాష్ట్ర శిశు విక్రయ ముఠాకు బేడీలు
ABN , Publish Date - May 29 , 2025 | 04:00 AM
నవజాత శిశువులు మొదలు.. నెలల వయసున్న చిన్నారులను విక్రయించే ఘరానా అంతర్రాష్ట్ర ముఠా ఆటను సూర్యాపేట పోలీసులు కట్టించారు. ముఠాలోని 13 మందిని అరెస్టు చేశారు.

13 మంది ముఠా సభ్యుల అరెస్టు
28 మంది శిశువులను విక్రయించిన గ్యాంగ్
10 మందిని కాపాడిన సూర్యాపేట పోలీసులు
నల్లగొండ శిశువిహార్కు తరలింపు
అల్లారుముద్దుగా చూసుకున్నామంటూ.. పెంచుకున్న తల్లిదండ్రుల ఆందోళన
సూర్యాపేటక్రైం, మే 28 (ఆంధ్రజ్యోతి): నవజాత శిశువులు మొదలు.. నెలల వయసున్న చిన్నారులను విక్రయించే ఘరానా అంతర్రాష్ట్ర ముఠా ఆటను సూర్యాపేట పోలీసులు కట్టించారు. ముఠాలోని 13 మందిని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ముఠా ఇప్పటి వరకు 28 మంది శిశువులను విక్రయించగా.. వారిలో 10 మందిని కాపాడి, శిశువిహార్కు తరలించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కొత్తపల్లి నర్సింహ వివరాలను వెల్లడించారు. శిశు అక్రమ రవాణాపై ఉప్పందుకున్న పోలీసులు.. ఇటీవల ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకున్న దంపతులను అదుపులోకి తీసుకుని, విచారించారు. వారు వెల్లడించిన వివరాలతో సూర్యాపేట పట్టణంలో నివసించే కోడిగుడ్ల వ్యాపారి నక్క యాదగిరి, అతని భార్య ఉమారాణిలను ప్రశ్నించగా.. ఘరానా ముఠా గుట్టు రట్టయింది. బుధవారం ఉదయం వలపన్నిన పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో యాదగిరి, ఉమారాణితోపాటు.. విజయవాడకు చెందిన దంపతులు కోరె రామలక్ష్మి, నాగేంద్రకుమార్, పిల్ల పావని, గరికముక్కు విజయలక్ష్మి, సత్యమణి, ముడావత్ రాజు, ఖాన్ షహీన, శోభారాణి, ఎండీ షహాన, సబావత్ శ్రీనివాస్, ఏర్పుల సునీత ఉన్నారు. వీరంతా ఓ చైన్మాదిరిగా కలిసి, ముఠాను ఏర్పాటు చేశారని ఎస్పీ వివరించారు. ‘‘సూర్యాపేటకు చెందిన నక్క యాదగిరి, ఉమారాణి దంపతులకు పిల్లలు లేరు. దీంతో వారు 28 నెలల క్రితం విజయవాడకు చెందిన నర్సు కోరె రామలక్ష్మి, ఆమె భర్త నాగేంద్రకుమార్ను కోరారు. దాంతో వారు పిల్ల పావనిని కలిశారు.
ఆమె పిల్లల విక్రయ ఏజెంట్లు-- విజయవాడలోని గొల్లపూడికి చెందిన గరికముక్కు విజయలక్ష్మి, ఏలూరురోడ్డుకు చెందిన ఆముదాలపల్లి సత్యమణి, రాజస్థాన్కు చెందిన రియాజ్, నజీర్ ద్వారా రూ.2.50 లక్షలకు యాదగిరి దంపతులకు అహ్మదాబాద్ నుంచి ఓ పాపను తెప్పించి, ఇచ్చారు. అప్పటి నుంచి యాదగిరి దంపతులు పిల్లల విక్రయ ముఠాతో కలిసి పనిచేస్తూ.. గ్రామాల్లో పిల్లలు కావాల్సిన వారిని గుర్తించేవారు. ముఠా ద్వారా వారికి పిల్లలను విక్రయించేవారు. ఈ క్రమంలో.. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట కు చెందిన పాత నేరస్థుడు ముడావత్ రాజు, కారు డ్రైవర్ సబావత్ శ్రీనివాస్, రాజస్థాన్కు చెందిన ఖాన్ షహీన, ఘట్కేసర్కు చెందిన శోభారాణి, సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన ఎండీ షహాన, సూర్యాపేటలోని గాంధీనగర్కు చెందిన నర్సు ఏర్పుల సునీత ముఠాలో సభ్యులయ్యారు. వీరంతా బుధవారం ఉదయం సూర్యాపేటలో ఉన్నట్లు సమాచారం అందుకుని, అరెస్టు చేశాం’’ అని ఎస్పీ వెల్లడించారు. ఈ ముఠా ఇప్పటి వరకు రాజస్థాన్, అహ్మదాబాద్ నుంచి అక్రమంగా రూ.50 వేలకు ఒకరు చొప్పున నవజాత శిశువులు, నెలల వయసున్న చిన్నారులను కొని, ఇక్కడ రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు విక్రయిస్తుంటారని పేర్కొన్నారు.
‘‘ఈ ముఠా ఇప్పటి వరకు 28 మంది శిశువులను విక్రయించింది. వారిలో.. సూర్యాపేట మండలం టేకుమట్లకు చెందిన ఇద్దరు, సూర్యాపేట పట్టణంలో ఇద్దరు, పెన్పహాడ్లో ఒకరు, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్లో ఇద్దరు, చిన్న సూరారంలో ఒకరు, హైదరాబాద్లో ఒకరితో కలిపి మొత్తం 10 మంది పిల్లలను సంరక్షించాం. వీరిలో ముగ్గురు ఆడశిశువులున్నారు. వీరందరినీ నల్లగొండ శిశువిహార్కు తరలించాం. మిగతా 18 మంది పిల్లలను కూడా కాపాడుతాం. పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేస్తాం’’ అని చెప్పారు. ముఠా సభ్యుల్లో ఒకరైన శారత ఇప్పటికే శిశు విక్రయాల కేసులో లఖ్నవూ జైలులో ఉన్నారని, విజయలక్ష్మిపై మునగాల, జనగాంతోపాటు.. ఏపీలోని ఏలూరు, మంగళగిరి ఠాణాల్లో కేసులున్నట్లు తెలిపారు. ఈ ముఠాలోని పలువురిపై వేర్వేరు పోలీ్సస్టేషన్లతోపాటు.. ముంబై సీఐడీలో కేసులున్నట్లు వెల్లడించారు. కాగా.. 10 మంది చిన్నారులను పోలీసులు కాపాడగా.. ఇంతకాలం వారిని పెంచుకున్న తల్లిదండ్రులు సూర్యాపేట పట్టణ పోలీ్సస్టేషన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను తమకు అప్పగించాలంటూ కన్నీటిపర్యంతం పోలీసులను వేడుకున్నారు. దీంతో కొద్దిసేపు ఠాణా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపివేయగా.. ఎస్పీ ప్రెస్మీట్ విషయాన్ని తెలుసుకుని, జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్నారు. రోదిస్తున్న తమ పెంపుడు తల్లిదండ్రులను చూసి, చిన్నారులు కూడా వారి దగ్గరకు వెళ్లడానికి ఆరాటపడడం చూసే వారిని కలిచివేసింది.
Also Read:
తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే
For More Telangana News and Telugu News..