Minister Seethakka: లేఖలు కాదు బహిరంగ క్షమాపణ చెప్పండి
ABN , Publish Date - May 21 , 2025 | 06:01 AM
మాజీ మంత్రి హరీష్రావు రాసిన లేఖపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. పదేళ్ల పాలనలో అంగన్వాడీ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.

మాజీ మంత్రి హరీష్రావుకు మంత్రి సీతక్క డిమాండ్
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): అధికారం పోయాక మినీ అంగన్వాడీల సమస్య గుర్తుకు వచ్చిందా? అని మాజీ మంత్రి టి.హరీ్షరావును మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి దాసరి అనసూయ సీతక్క ప్రశ్నించారు. అంగన్వాడీ టీచర్లకు వేతనాలపై సీఎం ఎ.రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ముందుగా బహిరంగ లేఖలు రాయడం మానుకుని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో బాధ పడ్డ ప్రజలకు హరీష్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మినీ అంగన్వాడీ టీచర్ల పట్ల బాధ్యత ఉంటే పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వారికి మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా ఎందుకు పదోన్నతి కల్పించలేదని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్థికశాఖ అనుమతుల్లేకుండా మొక్కుబడి జీవోలు జారీ చేసి చేతులు దులుపుకున్న చరిత్ర, అంగన్వాడీలకు పదోన్నతులు రాకుండా అన్యాయం చేసిందీ ఆయనదేనని విమర్శించారు. కానీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఎలాంటి న్యాయ పరమైన అడ్డంకులు తలెత్తకుండా ఆర్థికశాఖ అనుమతితో 3,438 మంది మినీ అంగన్వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పించామని సీతక్క గుర్తు చేశారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయడంతోపాటు టీచర్లకు తోడు సహాయకులను నియమిస్తున్నట్లు తెలిపారు.