Singareni Workers: సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులకు విద్యావకాశాలు
ABN , Publish Date - May 24 , 2025 | 03:22 AM
సింగరేణి కార్మికులు, వారి కుటుంబసభ్యులు, సమీప గ్రామాలకు చెందిన అందరికీ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా విద్యావకాశాలు అందించి పట్టభద్రులుగా తీర్చిదిద్దేందుకు బృహత్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు

వారిని పట్టభద్రులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
సింగరేణి సీఎండీ, అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ చర్చలు
త్వరలో సమగ్ర ప్రణాళిక రూపకల్పన
హైదరాబాద్ సిటీ, మే 23 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులు, వారి కుటుంబసభ్యులు, సమీప గ్రామాలకు చెందిన అందరికీ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా విద్యావకాశాలు అందించి పట్టభద్రులుగా తీర్చిదిద్దేందుకు బృహత్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సూచనలతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు సింగరేణి ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్సిటీ నిర్వహణలో విద్యా బోధనకున్న అవకాశాలపై శుక్రవారం సైఫాబాద్లోని సింగరేణి భవన్లో చర్చించారు. త్వరలో సమగ్ర ప్రణాళిక రూపొందించి అంబేడ్కర్ వర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రొ.ఘంటా చక్రపాణి మాట్లాడుతూ సింగరేణి అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాలతో మంచి పేరు సంపాదించిందని.. కార్మికులు, సమీప గ్రామాల ప్రజల విద్యాభివృద్ధికి తోడ్పడితే అది అన్నిటికన్నా పెద్ద సంక్షేమ కార్యక్రమవుతుందన్నారు.
సింగరేణివ్యాప్తంగా బోధనకు అనుకూల భవనాలను కేటాయిస్తే వర్సిటీ ద్వారా స్టడీ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సింగరేణివ్యాప్తంగా అందరినీ గ్రాడ్యుయేట్లుగా మార్చడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. ప్రాజెక్టు ప్రభావిత, నిర్వాసిత ప్రజలకు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీలు, పీజీ కోర్సులు చదివేందుకు సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆర్థిక సాయం అందించవచ్చని తెలిపారు. సింగరేణి సీఎండీ బలరామ్ మాట్లాడుతూ కార్మికుల్లో ఎక్కువ మంది హైస్కూల్, ఇంటర్ వరకే చదివారని, అలాంటి వారికి అంబేడ్కర్ వర్సిటీ ద్వారా పై చదువులకు అవకాశం కల్చించాలనే ఉద్దేశం సంస్థకు ఉందన్నారు. కార్యక్రమంలో ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. విజయ కృష్ణారెడ్డి, డైరెక్టర్ (అకడమిక్) ప్రొ.పుష్ప ఘంటా చక్రపాణి, డైరెక్టర్(యూజీసీ-డీఈబీ ఎఫైర్స్) ప్రొ.పల్లవి కబ్డే, సింగరేణి ఈడీ కోల్ మూమెంట్ ఎస్డీఎం సుభాని తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం
Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్ హోల్లోంచి..