Singareni Expansion: బొగ్గుపైనే మనుగడ సాగించలేం
ABN , Publish Date - May 21 , 2025 | 05:53 AM
భవిష్యత్తులో బొగ్గు నిల్వలు తరిగిపోతున్న నేపథ్యంలో సింగరేణి ఇతర ఖనిజాల ఉత్పత్తిలోకి అడుగుపెడుతోంది. 4000–5000 మెగావాట్ల సౌర విద్యుత్ లక్ష్యాన్ని కూడా సంస్థ ముందుకు తీసుకెళ్తోంది.

ఇతర ఖనిజాల ఉత్పత్తిలోకి సింగరేణి:సీఎండీ బలరామ్
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో కేవలం బొగ్గు ఉత్పత్తిపైనే సింగరేణి మనుగడ సాగించలేదని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ఎన్.బలరామ్ చెప్పారు. పర్యావరణ ఆంక్షలకు తోడు బొగ్గు నిల్వలు తరిగి పోవడంతో మరో 20 ఏళ్లలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు. తద్వారా బొగ్గు ఉత్పత్తి కూడా తగ్గుతుందని మంగళవారం సింగరేణి వ్యాప్తంగా అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇతర కీలక ఖనిజాల ఉత్పత్తి రంగంలోకి అడుగు పెట్టాలని సంస్థ నిర్ణయించిందని బలరామ్ తెలిపారు. కేంద్రం ప్రోత్సాహంతో ఇతర ఖనిజాల ఉత్పత్తిలో సింగరేణికి ఉజ్వల అవకాశాలున్నాయన్నారు. ఇతర ఖనిజాల ఉత్పత్తి కోసం 3 సంస్థలనూ నియమించుకున్న సింగరేణి.. అవసరమైతే ఇతర కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్గా బలరామ్ వెల్లడించారు. ఇతర బొగ్గు ఉత్పత్తి సంస్థల కంటే సింగరేణి బొగ్గు ధర ఎక్కువగా ఉందని, ఉత్పాదకత పెంచి కనీసం టన్ను బొగ్గుపై రూ.1000 తగ్గించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో 20 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా.. సింగరేణి 4000/5000 మెగావాట్ల ఉత్పత్తికి పూనుకోవాలని చెప్పారు. కొత్తగా 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేస్తే, సింగరేణి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2000 మెగావాట్లకు చేరుతుందన్నారు.