ECET Results: ఈసెట్లో ఫలితాల్లో సత్తాచాటిన సిద్దిపేట విద్యార్థినులు
ABN , Publish Date - May 27 , 2025 | 05:10 AM
ఆదివారం విడుదలైన తెలంగాణ ఈసెట్ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థినులు సత్తా చాటారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు.

మిరుదొడ్డి, మే 26 (ఆంధ్రజ్యోతి): ఆదివారం విడుదలైన తెలంగాణ ఈసెట్ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థినులు సత్తా చాటారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. అక్బర్పేట-భూంపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రేవతి ఈసీఈలో 200 మార్కులకు గాను 164 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన నవ్య 161మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. అంతేకాకుండా ఏపీ ఈసెట్ ఫలితాల్లోనూ వీరే ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించడం విశేషం.
నమాజ్ ఘటనలో ఫొటోగ్రాఫర్పై కేసు
తిరుమల, మే 26 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా ఇతర మతానికి చెందిన వ్యక్తి నమాజ్ చేసిన ఘటనలో తిరుమలకు చెందిన ఓ ప్రైవేట్ ఫొటోగ్రాఫర్పై కేసు నమోదైంది. ఈనెల 22వ తేదీన చెన్నైకు చెందిన అబ్బాస్ అనే వ్యక్తి తిరుమలలోని కల్యాణవేదికలో నమాజ్ చేయగా, దాని వీడియో విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజిలెన్స్, పోలీసులు లోతుగా దర్యాప్తు చేసిన క్రమంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్యాణ వేదికలో ఫొటో స్టూడియో లైసెన్స్తో ఫొటోగ్రాఫర్గా ఉన్న గోవర్ధన్ అనే వ్యక్తి వద్దకు అబ్బాస్ వెళ్లి.. ఇక్కడ నమాజ్ చేయవచ్చా అని అడిగిన క్రమంలో, చేసుకోవచ్చని అతడు చెప్పినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో గోవర్ధన్పై తిరుమల టూటౌన్లో కేసు నమోదైంది. అలాగే అతడి లైసెన్సును సీజ్ చేశారు.