Seethakka: నవంబరులో వెయ్యి అంగన్వాడీల నిర్మాణం
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:12 AM
ఇందిరాగాంధీ జయంతి (నవంబరు 19) నాటికి రాష్ట్రంలో వెయ్యి అంగన్వాడీల భవనాలను ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.

శిథిలావస్థకు చేరిన భవనాలపై దృష్టి: మంత్రి సీతక్క
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఇందిరాగాంధీ జయంతి (నవంబరు 19) నాటికి రాష్ట్రంలో వెయ్యి అంగన్వాడీల భవనాలను ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అదనపు నిధులు అవసరమైతే.. మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సచివాలయంలో అంగన్వాడీ కేంద్రాల పని తీరుపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కాగా, టీజీపీఎస్సీ ద్వారా సీడీపీవోలుగా ఎంపికైన 23 మందికి సచివాలయంలో మంత్రి సీతక్క నియామక పత్రాలు అందజేశారు.
ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఆమె సూచించారు. కాగా, వానాకాలంలో తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీతక్క సూచించారు. జిల్లాల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ మిషన్ భగీరథ పైప్లైన్లను నిత్యం పరిశీలించాలని, పైపుల లీకేజీలను నివారించాలని సూచించారు.