Seethakka: కిషోర బాలికల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - May 30 , 2025 | 04:27 AM
కిషోర బాలికల ఆరోగ్యం, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ అమృతం పథకానికి శ్రీకారం చుట్టిందని మంత్రి సీతక్క తెలిపారు.

‘ఇందిరమ్మ అమృతం’తో పౌష్టికాహారం
ఖనిజ సంపద దోపిడీకి కేంద్రం కుట్ర
నక్సల్స్ పేరుతో ఆదివాసీల ఎన్కౌంటర్: మంత్రి సీతక్క
కొత్తగూడెం/పాల్వంచ రూరల్, మే 29 (ఆంధ్రజ్యోతి): కిషోర బాలికల ఆరోగ్యం, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ అమృతం పథకానికి శ్రీకారం చుట్టిందని మంత్రి సీతక్క తెలిపారు. గురువారం కొత్తగూడెంలో ఈ పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం క్లబ్లో జరిగిన సభలో సీతక్క మాట్లాడారు. 14-18 ఏళ్ల వయసు కలిగిన బాలికల్లో రక్తహీనతను తగ్గించడంతోపాటు వయసుకు తగిన బరువుండేలా చూడాలన్న ఉద్దేశంతో ఈ పథకానికి రూపకల్పన చేశామని చెప్పారు. భద్రాద్రి, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నామని తెలిపారు.
ఈ మూడు జిల్లాల్లో 50,269 మంది కిషోర బాలికలకు చిరుధాన్యాలతో తయారు చేసిన పట్టీలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ఆశా వర్కర్ల జీతాలను పెంచి, వారి ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేస్తామని తెలిపారు. కాగా, పలు రాష్ట్రాల్లో ఉన్న అపార ఖనిజ సంపదను దోచుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని సీతక్క ఆరోపించారు. భద్రాద్రి జిల్లా కిన్నెరసాని ఆశ్రమ క్రీడా పాఠశాలలో ఆదివాసీ కాంగ్రెస్ భూన్యాది కార్యకర్తల సమ్మేళన శిక్షణ తరగతుల్లో ఆమె మాట్లాడారు. ఎన్కౌంటర్ పేరుతో ఆదివాసీలను హతమా ర్చి, వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు ఇవ్వకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని ధ్వజమెత్తారు.