Raja Singh: కుల రాజకీయం జరుగుతుందా
ABN , Publish Date - Jun 11 , 2025 | 07:07 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థిని కుల సమీకరణ ఆధారంగా నిర్ణయిస్తారా..? లేక సీనియర్లకు అవకాశం ఇస్తారా..? అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీనియర్లకు అవకాశం ఇస్తారా??
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికపై..కిషన్రెడ్డిని ఉద్దేశించి రాజాసింగ్ వ్యాఖ్య
ముస్లింల ఓట్లను ఈసారి మజ్లిస్ ఏ పార్టీకి అమ్మేయనుందోనని ఎద్దేవా
హైదరాబాద్ సిటీ, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థిని కుల సమీకరణ ఆధారంగా నిర్ణయిస్తారా..? లేక సీనియర్లకు అవకాశం ఇస్తారా..? అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజాసింగ్ తరచూ ఏదో ఒక అంశంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డిని పరోక్షంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తావనను తీసుకొచ్చారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మాగంటి గోపీనాథ్ చనిపోయారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోపు ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉప ఎన్నికపై వివిధ పార్టీల్లో చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో రాజాసింగ్ మాట్లాడారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకర్గంలోని ముస్లిం ఓటు బ్యాంక్ను ఎంఐఎం నాయకులు బీఆర్ఎస్కు అమ్మేశారని ఆరోపించారు. రాబోయే ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి అమ్ముతారా..? లేక కాంగ్రెస్కు విక్రయిస్తారా..? అన్నది ముందు ముందు తెలుస్తుందన్నారు.
ఇక, బీజేపీ విషయానికొస్తే గతంలో కుల రాజకీయం జరిగిందని, ఇప్పుడు కూడా కుల సమీకరణ జరుగుతుందా..? లేక సీనియర్లకు అవకాశం ఇస్తారా..? అనేది చూడాలన్నారు. కాగా, రాజాసింగ్ ఇటీవల కిషన్రెడ్డి లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన గవర్నర్ దత్తాత్రేయ ఆత్మ కథ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కూడా రాజాసింగ్ హాట్ కామెంట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజాసింగ్ కొంత కాలం పాటు స్తబ్దుగా ఉన్నప్పటికీ, తర్వాత తరచూ ఏదో అంశంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆయన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కూడా చేయలేదు. ఢిల్లీ నుంచి అగ్రనేతలు వస్తే తప్ప పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. ఆయన రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళుతున్న దాఖలాలు కూడా లేవు. అయితే పార్టీలోని సీనియర్ నేతలు ఎవరూ రాజాసింగ్ వ్యాఖ్యలపై పెదవి విప్పడం లేదు. అంతర్గతంగా పార్టీ నాయకుల మధ్య చర్చ జరుగుతున్నప్పటికీ ఎవరూ దీనిపై స్పందించడం లేదు.