Ponnam Prabhakar: ఉన్నతంగా విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Jun 13 , 2025 | 03:54 AM
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఆరోగ్యకర ఆహారం, వసతులు కల్పించి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని బీసీ సంక్షేమశాఖ అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

విద్యార్థుల ఖాతాల్లో కాస్మొటిక్ చార్జీలు జమ: పొన్నం
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఆరోగ్యకర ఆహారం, వసతులు కల్పించి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని బీసీ సంక్షేమశాఖ అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వేసవి సెలవుల తర్వాత బీసీ గురుకులాలు, హాస్టళ్లు ప్రారంభమైన నేపథ్యంలో గురువారం బీసీ సంక్షేమశాఖ అధికారులతో మంత్రి పొన్నం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పేద, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించడంతోపాటు రాష్ట్రం, దేశం గర్వ పడేలా ప్రిన్సిపాళ్లు, హాస్టల్ వార్డెన్లతోపాటు ఉద్యోగులంతా క్షేత్రస్థాయిలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఈ ఏడాది నుంచి విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే కాస్మొటిక్ చార్జీల జమ చేసేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.