Adilabad MP Nagesh: పటాన్చెరు- ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపట్టాలి
ABN , Publish Date - May 21 , 2025 | 06:28 AM
పటాన్చెరు-ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించాలని ఎంపీ గడ్డం నాగేశ్ రైల్వే అధికారులను కోరారు. రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ సానుకూలంగా స్పందించి, అంచనాలు రూపొందించి బోర్డుకు పంపనున్నట్లు వెల్లడించారు.

దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఎంపీ నగేష్ విజ్ఞప్తి
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): పటాన్చెరు- ఆదిలాబాద్ రైల్వేలైన్ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని ఆదిలాబాద్ ఎంపీ జి.నగేష్ దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్తో నగేష్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రతిపాదించిన రైల్వే ప్రాజెక్టు పనులను త్వరితంగా పూర్తి చేయాలని కోరారు. ఆదిలాబాద్- గచ్చందూర్ (మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా) వరకు సుమారు 90 కి.మీ నూతన రైల్వే లైన్ సర్వే పనులు పూర్తి చేయించాలన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రతిపాదించిన పనులకు రైల్వేబోర్డు నుంచి సానుకూల స్పందన వచ్చిందని రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పటాన్చెరు- ఆర్మూర్- ఆదిలాబాద్, ఆదిలాబాద్- గచ్చందూర్ రైల్వే లైన్ నిర్మాణ పనులకు అంచనాలను రూపొందించి బోర్డుకు పంపనున్నట్టు ఆయన పేర్కొన్నారు.