Vemulawada: ఎండలకు ‘రాజన్న’ కోడెలు విలవిల
ABN , Publish Date - May 11 , 2025 | 05:26 AM
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో ఎండల తీవ్రతను తట్టుకోలేక గోవులు అస్వస్థతకు గురై మృత్యువాత పడుతున్నాయి.

రెండు కోడెల మృతి, మరికొన్నింటికి అస్వస్థత
వేములవాడ కల్చరల్, మే 10 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో ఎండల తీవ్రతను తట్టుకోలేక గోవులు అస్వస్థతకు గురై మృత్యువాత పడుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే రెండు కోడెలు మృతి చెందగా, మరికొన్ని కోడెలు అస్వస్థతకు గురయ్యాయి. ప్రభుత్వం కోడెల సంరక్షణ కోసం నూతనంగా 4 షెడ్లను నిర్మించి వాటిలో ఫ్యాన్లు, స్ర్పింక్లర్లను అమర్చింది.
కానీ వాటి నిర్వహణలో, గోవులకు సరైన పరిమాణంలో పచ్చిగడ్డిని, దాణాను అందించడంలోనూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజన్న గోశాలలో ఉన్న సుమారు 1300 కోడెలకు రెండు ట్రాక్టర్ల పచ్చిగడ్డి అందజేస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. వందల సంఖ్యలో ఉన్న కోడెలకు అది ఏమాత్రం సరిపోదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకుని కోడెలను సంరక్షించాలని భక్తులు కోరుతున్నారు.