పింఛన్దారులకు కష్టాలు
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:57 AM
సామాజిక భద్రతా పింఛన్దారులను ఫేస్ రికగ్నైజేషన్ కష్టాలు వేధిస్తున్నాయి. ఇన్నాళ్లు వేలిముద్రల ద్వారా తీసుకున్న పింఛన్కు ఇక నుంచి ముఖ ఆధారిత హాజరు అమలు చేస్తుండడంతో తిప్పలు తప్పడంలేదు. సాంకేతిక సమస్యలు ఓ వైపు, నెట్వర్క్ లేక మరోవైపు పంచాయతీ కార్యదర్శులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.

భువనగిరి రూరల్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): సామాజిక భద్రతా పింఛన్దారులను ఫేస్ రికగ్నైజేషన్ కష్టాలు వేధిస్తున్నాయి. ఇన్నాళ్లు వేలిముద్రల ద్వారా తీసుకున్న పింఛన్కు ఇక నుంచి ముఖ ఆధారిత హాజరు అమలు చేస్తుండడంతో తిప్పలు తప్పడంలేదు. సాంకేతిక సమస్యలు ఓ వైపు, నెట్వర్క్ లేక మరోవైపు పంచాయతీ కార్యదర్శులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల ఆసరా పింఛన్ అందిస్తోంది. అయితే వేలి ముద్రల ద్వారా ఆసరా పింఛన్ పొందుతున్న వారు నూతనంగా ఈ నెల నుంచి ముఖ గుర్తింపు హాజరు తీసుకోవాల్సి ఉంటుంది. వృద్ధులకు సరిగా నమో దుకాకపోవడంతో తంటాలు పడుతున్నారు.
గంటల తరబడి నిరీక్షణ
భువనగిరి మండలంలోని 34 గ్రామపంచాయతీల పరిధిలో 6,382 వివిధ రకాల సామాజి క భద్రతా పింఛన్దారులు ఉన్నారు. మూడు గ్రామాలకు ఒకరు చొప్పున పంపిణీ చేయాల్సి ఉంటుంది. మూడు గ్రామాల్లో షెడ్యుల్ ప్రకా రం పింఛన్దారుల ముఖ ఆధారిత హాజరు సేకరించేందుకు ఉదయం 9.30గంటలకు గ్రామపంచాయతీకి చేరుకుంటున్నారు. సాంకేతిక కారణాలతో వృద్ధుల హాజరు నమోదు కావడంలేదు. ఒక్కొక్కరికి 10 నుంచి 15సార్లు తీసుకోవాల్సి ఉండగా, దాదాపు 40 నిమిషాల సమయం కేటాయించాల్సి వస్తోంది. దీంతో వృద్ధులు, దివ్యాంగులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. గ్రామాల్లో నెట్వర్క్ సమస్య కూడా ఉండడంతో ఇబ్బందులు తప్పడంలేదని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. తమకు పాత విధానం ద్వారానే వేలి ముద్రలు తీసుకుని పింఛన్లు అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక ఎంపీడీవో సీహెచ్ శ్రీనివా్సను వివరణకోరగా డీఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.