ధాన్యం కాంటాల్లో వేగం పెంచాలి
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:10 AM
పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేగంగా కాంటాలు వేయాలని రైతులు డిమాండ్ చేశారు.

నూతనకల్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేగంగా కాంటాలు వేయాలని రైతులు డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని చిల్పకుంట్లలోని కొనుగోలు కేంద్రంలో కాంటాలు ఆలస్యం కావడంతో రైతులు తెచ్చిన ధాన్యాన్ని పోసేందుకు స్థలం లేక ఇబ్బంది పడ్డాడరు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు మండలకేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంటాలు ఆలస్యం కావడంతో గ్రామం నుంచి వచ్చే రైతులు తమ ధాన్యం పోయడానికి స్థలం లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆలస్యంగా కొనుగోళ్లు చేపడుతున్నారని ఆరోపించారు. ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివా్సరావు రాస్తారోకో చేస్తున్న ప్రాంతానికి వచ్చి రైతులతో మాట్లాడారు. సకాలంలో కాంటాలు అయ్యేలా చర్యలు తీసుకుని, వెంటనే లోడ్ చేసి మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో ఆ గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.