భూసేకరణే సవాల్
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:42 AM
సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ జిల్లా యంత్రాంగానికి సవాల్గా మారింది. భూముల ధరలు రెట్టింపు కావడంతో, తమ విలువైన భూములను తక్కువ ధరకే ప్రభుత్వానికి అప్పగించేందుకు రైతులు ఒప్పుకోవడంలేదు.

‘గంధమల’్ల రిజర్వాయర్కు దాదాపు 1,100 ఎకరాలు
గంధమల్ల, వీరారెడ్డిపల్లిలో భూసేకరణకు కసరత్తు
రైతులు డిమాండ్కు, ప్రభుత్వ పరిహారానికి భారీ వ్యత్యాసం
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ జిల్లా యంత్రాంగానికి సవాల్గా మారింది. భూముల ధరలు రెట్టింపు కావడంతో, తమ విలువైన భూములను తక్కువ ధరకే ప్రభుత్వానికి అప్పగించేందుకు రైతులు ఒప్పుకోవడంలేదు. దీంతో జిల్లాలో ప్రధాన ప్రాజెక్ట్లైన గంధమల్ల, బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వ నిర్మాణాలకు భూసేకరణ కష్టంగా మారింది. రైతులు ఎకరాకు రూ.40లక్షలు డిమాండ్ చేస్తుంటే, ప్రభుత్వం మాత్రం రూ.11.50లక్షలు మాత్రమే ఇస్తామంటోంది.
రైతులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం చెల్లించనున్నారు. గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంతో భూములు కోల్పోతోన్న రైతులకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న రిజిస్ర్టేషన్ ధరలకు మూడింతలు చెల్లించేందుకు అంచనాలు సిద్ధంచేస్తోంది. శుక్రవారం కలెక్టరేట్లో సాగునీటి ప్రాజెక్టుల కింద భూముల సేకరణపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సీరియ్సగా చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, వీలైనంత త్వరగా అవార్డ్ను పాస్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే పరిహారం తీసుకునేందుకు రైతులను ఎలా ఒప్పించాలన్న అంశంపై కూడా అధికారులు చర్చించారు. అయితే మార్కెట్ ధర ప్రకారం ఈ ప్రాంతంలోని రైతులు రూ.40లక్షలకు తక్కువగా తీసుకునే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. రిజిస్ర్టేషన్ ధర రూ.3.60లక్షల వరకు ఉంటుంది. ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని రైతులు అడుగుతున్న పరిహారానికి... ప్రభుత్వం చెల్లిస్తామన్న పరిహారానికి భారీ వ్యత్యాసం కన్పిస్తుంది. ఈ నేపథ్యంలో భూసేకరణ వేగవంతమయ్యేనా? రైతులను ఏవిధంగా ఒప్పించాలన్న అంశంపై జిల్లాయంత్రాంగం తీవ్రంగా కసరత్తు ప్రారంభించింది.
భూసేకరణ బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదే..
జిల్లాలో చేపట్టిన గంధమల్ల, బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వ తదితర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భూసేకరణ బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలు తీసుకోవాలని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల జరిగిన సభలో ప్రకటించారు. రిజర్వాయర్లు, కాల్వల పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తిగా కావాలంటే భూసేకరణే ప్రధాన సమ స్య. అయితే రిజర్వాయర్తోపాటు సాగునీటి కాల్వల పునరుద్ధరణలో భూములు కోల్పోతోన్న రైతులు పరిహారం చెల్లింపుపై జిల్లాయంత్రాంగం కసరత్తు చేస్తోంది. తుర్కపల్లి మండలంలో గంధమల్ల రిజర్వాయర్ పనులకు ఈ నెల 6న ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.575.57కోట్లతో నిర్మిస్తున్న పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. బీకేఎం-నవయుగ-ప్రసాద్ అనే సంస్థ కాంట్రా క్టు దక్కించుకుంది. రిజర్వాయర్ నిర్మాణంతో ముంపునకు గురయ్యే వీరారెడ్డిపల్లి, గంధమల్ల రెవెన్యూ గ్రామాల్లో దాదాపు 1,100ఎకరాల వరకు భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు భూముల రిజిస్ర్టేషన్ విలువ, మార్కెట్ ధరను పరిశీలించారు. ఎంత మేరకు రైతులకు పరిహారం అందించాలన్న అంశంపై జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రైతులతో రెవెన్యూ అధికారులు చర్చలు జరిపారు. ప్రభుత్వం ఎకరాకు రూ.11.50లక్షల వరకు చెల్లిస్తుందని అధికారులు రైతులకు వివరించారు. అయితే ఇంత తక్కువ ధరకు తమ భూములు ఇచ్చేదిలేదని రైతులు తేల్చి చెబుతు న్నారు. మరోసారి రైతులతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటుచేసి, నష్టపరిహారంపై తేల్చేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఆఖరికి దాదాపు రైతులకు ఎకరాకు రూ.17లక్షల నుంచి రూ.18లక్షల వరకు పరిహారం చెల్లించేలా ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
9.8 టీఎంసీల నుంచి 1.41 టీసీఎంలకు పరిమితం
సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతంగా, నదీజలాల సదుపాయం లేని కరువు నేల యాదాద్రి భువనగిరి జిల్లాకు గోదావరి జలాల మళ్లింపునకు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 14, 15,16 ప్యాకేజీల కింద పనులు ప్రారంభించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే 14, 15వ ప్యాకేజీలో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల వద్ద రిజర్యాయర్ నిర్మించేందుకు గత ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. ఎత్తిపోతల లింక్ ప్రాజెక్టులో చివరి(టెయిల్ఎండ్)లో గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లు ప్రతిపాదించారు. ప్రభుత్వం పూర్తి స్థాయి సర్వేకు ఆదేశించడంతో రిజర్వాయర్ నిర్మాణంతో కోల్పోతున్న భూముల్లో ప్రాజెక్టుకు సంబంధించిన హద్దురాళ్లను కూడా ఏర్పాటుచేశారు. ఈ రిజర్వాయర్ను మొదట 9.8 టీఎంసీలుగా నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా 2,450 క్యూసెక్కుల నీరు గంధమల్ల జలాశయానికి చేరేలా ప్రణాళికను రూపొందించారు. డిస్ర్టిబ్యూటరీ కాల్వల ద్వారా 6,467 ఎకరాలు, ప్రధాన ఎడమకాల్వ (ఎల్ఎంసీ) ద్వారా 37,814 ఎకరాలు, కుడికాల్వ (ఆర్ఎంసీ) ద్రావా 19,901 ఎకరాలు సాగునీరు అందించేందుకు అంచనాలు రూపొందించారు. ప్రధాన కాల్వ, డిస్ర్టిబ్యూటరీలకు 4,162 ఎకరాల భూమి అవసరం కాగా, రిజర్వాయర్ వల్ల 4,027ఎకరాల భూమితోపాటు 1,568 ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో గంధమల్ల, బచ్చలగూడెం, ఇందిరానగర్ గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతుండగా వీరారెడ్డిపల్లిలో దాదాపు 1,800 ఎకరాలు వరకు భూములు కోల్పోయే అవకాశం ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిర్వాసితులు నిరసన వ్యక్తం చేయడంతో మరోసారి 4.28 టీఎంసీలకు తగ్గించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో గ్రామాలు ముంపునకు గురికాకుండా, భూసేకరణ కూడా తక్కువయ్యేట్టు.. రిజర్వాయర్ను 1.41 టీఎంసీలకు తగ్గించింది.
దాదాపు 1,100ఎకరాల వరకు భూసేకరణకు సన్నాహాలు
గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి దాదాపు 1,100 ఎకరాల వరకు భూమిని సేకరించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో కట్ట నిర్మించేందుకు దాదాపు 112 ఎకరాలు, ముం పు ప్రాంతాలైన గంధమల్లలో 650 ఎకరాలు, వీరారెడ్డిపల్లిలో 340 ఎకరాలు సేకరించనున్నారు. రెండు కిలోమీటర్ల పొడవును కట్ట నిర్మించనున్నారు. ఈ భూమిని గంధమల్ల గ్రామంలో సేకరించాలి. ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే ఆలేరు నియోజకవర్గంలో దాదాపు 60వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. వీటిలో తుర్కపల్లిలో 945 ఎకరాలు, ఆలేరు మండలంలో 10,506 ఎకరాలు, రాజపేట మండలంలో 33,014 ఎకరాలు, యాదగిరిగుట్ట మండలంలో 14,522 ఎకరాలకు సాగునీరు అందనుంది.
పరిహారంపై రైతులతో చర్చించి నిర్ణయం : జి.వీరారెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ
గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ నిర్ణయం మేరకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే భూములు కోల్పోతోన్న రైతులతో సమావేశం ఏర్పాటుచేశాం. పరిహారం చెల్లింపుపై అవగాహన కల్పించాం. రిజర్వాయర్ నిర్మాణంతో గంధమల్ల, వీరారెడ్డిపల్లిలో దాదాపు వేయి ఎకరాల వరకు ముంపునకు గురవుతుంది. ప్రభుత్వం రైతులకు భూసేకరణ, పునరావాసం, పునరావాసంలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కుచట్టం 2013 ప్రకారం పరిహారం చెల్లిస్తుంది. త్వరలోనే మరోసారి రైతులతో పరిహారంపై చర్చించనున్నాం.