Share News

సీటీస్కాన్‌ ఉన్నా ఉపయోగమేదీ?

ABN , Publish Date - Jun 14 , 2025 | 12:45 AM

భువనగిరి జిల్లా ఆస్పత్రికి మంజూరైన సీటీ స్కాన్‌ నిరుపయోగంగా మారింది. దీంతో సీటీ స్కాన్‌ తప్పనిసరి అయిన బాధితులు విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయిస్తూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

సీటీస్కాన్‌ ఉన్నా ఉపయోగమేదీ?

భువనగిరి టౌన్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): భువనగిరి జిల్లా ఆస్పత్రికి మంజూరైన సీటీ స్కాన్‌ నిరుపయోగంగా మారింది. దీంతో సీటీ స్కాన్‌ తప్పనిసరి అయిన బాధితులు విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయిస్తూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జెడ్‌ చొంగ్తు జిల్లా ఆసుపత్రి పరిశీలనకు వచ్చిన సమయంలో జిల్లా ఆసుపత్రి ఆవరణలోని తెలంగాణ డయాగ్నొస్టిక్‌ హబ్‌కు ఆమె అప్పటికప్పుడే సీటీ స్కాన్‌ యూనిట్‌ను మంజూరు చేశారు. సుమారు నాలుగు నెలల క్రితం సీటీ స్కాన్‌ యూనిట్‌ టీహబ్‌కు చేరింది. కానీ పలు కారణాలతో నేటికీ రూ.కోట్ల విలువైన ఆ యంత్రాన్ని గదికే పరిమితం చేశారు.

హైటెన్షన్‌ పవర్‌, టెక్నీషియన్ల కొరత

ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ సామర్థ్యంతో సీటీ స్కాన్‌ యూనిట్‌ నిర్వహణ సాధ్యం కాదు. హైటెన్షన్‌ పవర్‌ కనెక్షన్‌ ఉంటేనే స్కాన్‌ యూనిట్‌ పనిచేస్తుంది. ఈ మేరకు హైటెన్షన్‌ పవర్‌ కనెక్షన్‌ కోసం వైద్యాధికారులు చేసిన దరఖాస్తుతో ట్రాన్స్‌కో సుమారు రూ.11లక్షల అంచనాతో ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిసింది. కానీ నెలలు గడుస్తున్నా చలానా చెల్లించకపోవడంతో నేటికీ కనెక్షన్‌ ఇవ్వలేదు. అలాగే సిటీ స్కాన్‌ నిర్వహణకు రేడియాలజిస్ట్‌ అందుబాటులో ఉన్నప్పటికీ అవసరమైన నలుగురు టెక్నీషియన్ల నియామకం కోసం ఆసుపత్రి అధికారులు వైద్య ఆరోగ్య శాఖకు పంపిన ప్రతిపాదనలకు నేటికీ మోక్షం లభించలేదు.

నిరుపయోగంగా యూనిట్‌

రోడ్డు ప్రమాదాల్లో తలకు, శరీరానికి అయిన అంతర్గత గాయాలు, ఇంటర్నల్‌ బ్లీడింగ్‌, గుండె పని తీరు, క్యాన్సర్‌, తదితర లోపాలు, గాయాల తీవ్రతను గుర్తించేందుకు సీటీ స్కాన్‌ తప్పనిసరి. కానీ టీహబ్‌కు ప్రభుత్వం మంజూరు చేసిన సీటీ స్కాన్‌ యూనిట్‌ నెలల తరబడిగా నిరుపయోగంగా ఉంటుండడంతో బాధితులు ప్రైవేట్‌ సెంటర్లను ఆశ్రయిస్తూ ఫీజుల రూపంలో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. హైటెన్షన్‌ పవర్‌ కనెక్షన్‌ లేకపోవడం, టెక్నీషియన్ల నియామకాలు చేపట్టకపోవడమే సీటీ స్కాన్‌ నిరుపయోగంగా ఉంటడానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. రూ.కోట్ల విలువైన సీటీ స్కాన్‌ నిరుపయోగంగా ఉండటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపాదనలు నివేదించాం : డాక్టర్‌ జి.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌, జిల్లా కేంద్ర ఆసుపత్రి

హైటెన్షన్‌ పవర్‌ కనెక్షన్‌ కోసం ట్రాన్స్‌కో రూపొందించిన అంచనా బడ్జెట్‌ను టీఎ్‌సఎంఎ్‌సఐడీసీకి నివేదించాం. అనుమతులు, నిధులు రాగానే చలానా చెల్లిస్తాం. టెక్నిషియన్ల నియామకాల కోసం వైద్య ఆరోగ్య శాఖకు ప్రతిపాదనలు పంపాము. అనుమతులు రాగానే కలెక్టర్‌ ఆధ్వర్యంలో నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తాం. సమస్యలను అధిగమించి త్వరలోనే సీటీ స్కాన్‌ను వినియోగంలోని తెచ్చి ఉచిత సేవలు అందిస్తాం.

Updated Date - Jun 14 , 2025 | 12:45 AM