రైతు భరోసా భూభారతి ఆధారంగా..
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:25 AM
ప్రభుత్వం భూభారతి పోర్టల్లో నమోదైన భూ విస్తీర్ణం, రైతుల వివరాల ఆధారంగానే రైతుభరోసా అందజేసేందుకు నిర్ణయించింది.

మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
రైతుల వివరాలు, ఖాతా నెంబర్లు పంపించాలని ఆదేశాలు
ఆనలైనలో నమోదు కాని వివరాలు తిరిగి నమోదు
ఈ నెల 5 వరకు పాస్బుక్ పొందిన వారికి సైతం సాయం
ఉమ్మడి జిల్లాలో 11.56లక్షల మంది పట్టాదారులు
పూర్తి సమాచారం పంపేందుకు వ్యవసాయశాఖ సన్నద్ధం
నల్లగొండ, జూన 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం భూభారతి పోర్టల్లో నమోదైన భూ విస్తీర్ణం, రైతుల వివరాల ఆధారంగానే రైతుభరోసా అందజేసేందుకు నిర్ణయించింది. వ్యవసాయయోగ్యం కాని భూములకు రైతుభరోసా పథకం వర్తించని విషయం తెలిసిందే. తాజాగా, ప్రభుత్వం రైతుభరోసాకు సంబంధించి మార్గదర్శకాలను, విధివిధానాలను వెల్లడించింది. వానాకాలం సీజనలో రైతుభరోసాను ఎకరానికి రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.12వేలు చెల్లించనుంది. అయితే ఎన్ని ఎకరాల వరకు రైతుభరోసా చెల్లిస్తామనే దానిపై ప్రభుత్వం వివరాలు వెల్లడించలేదు.
వానాకాలం సీజనలో రైతులకు పెట్టుబడి సాయం ఎలా అందించాలి? గతంలో ఉన్న పొరపాట్లను ఎలా సరిదిద్దాలి? అనే అంశంపై రైతుల వివరాలు, ఖాతా నెంబర్లు తిరిగి పంపించాలని సూచిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పట్టాదారుల డేటాను సవివరంగా పంపేలా చూడాలని స్పష్టం చేసింది. ఆర్బీఐ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ప్లాట్ఫాం కుబేర్ను ఉపయోగించి రైతుభరోసా సాయాన్ని అందించనుంది. పట్టాదారుల వివరాలు, బ్యాంక్ వివరాల్లో లోపాలు ఉంటే అవసరమైన వాటిని సరిదిద్ధి అధికారులు పూర్తిగా ధ్రువీకరించిన తరువాతనే ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 11,56,800మంది పట్టాదారులు ఉన్నారు.
ఈ నెల 5 వరకు కొత్త పాస్ పుస్తకాలు వచ్చినా..
కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులకు సైతం రైతుభరోసాను వర్తించనుంది. అందుకు ప్రభుత్వం ఈనెల 5వ తేదీ వరకు కటాఫ్ డేట్ను ప్రకటించింది. 5వ తేదీ వరకు పాస్బుక్ పొందిన రైతులకు రైతుభరోసా అందుతుంది. యాసంగిలో నాలుగు ఎకరాలలోపు ఉన్న వారికి మాత్రమే రైతుభరోసాను చెల్లించిన ప్రభుత్వం వానాకాలంలో ఏ మేరకు చెల్లిస్తామనే దానిపై ఒక నిర్ణయానికి రాలేదు. గత సీజనలో అంటే 2024-25లో వ్యవసాయశాఖ అధికారులు పంపింపిన డేటా రికార్డులను పరిశీలించి అందులో ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తిస్థాయి వివరాలు పంపాలని ప్రభుత్వం కోరింది. ఎంఏవో, ఏడీఏలు, డీఏవోలు పూర్తిస్థాయిలో పరిశీలన చేసి సమగ్రమైన సమాచారాన్ని పంపనున్నారు. ఏఈవోలు సంబంధిత ఖాతా నెంబర్, పట్టాదారునిదేనని నిర్ధారించుకున్న తరువాతనే ఆనలైనలో ఆప్లోడ్ చేస్తారు. ఏదైనా లోపాలు గమనిస్తే ఏఈవో లాగినకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఎంఏవోలు బ్యాంకు ఖాతాలు వివరాలు ధ్రువీకరించిన తరువాత రైతుభరోసా చెల్లించడానికి వీలుంటుంది. వివరాలు పంపించే సమయంలో ప్రధానంగా బ్యాంకు ఖాతాలు, పట్టాదారు పాస్పుస్తకం మొదటి పేజీని ఏఈవో ద్వారా పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
రికార్డులను సరిదిద్దడంతో తొలగనున్న సమస్యలు
భూ రికార్డుల్లో గతంలో ఉన్న పలు లోపాలను ప్రభుత్వం సరిదిద్దడం కోసం ప్రత్యేకంగా ఓ ప్రొఫార్మాను రూపొందించి అందులో డేటాను నమోదు చేయాలని అధికారులను ఆదేశించింది. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ఆధారంగా రైతుబంధు సాయం ఇవ్వగా, అప్పట్లో సాగులో లేని భూములకు, గుట్టలకు, వెంచర్లకు కూడా రైతుబంధు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన భూభారతి ఆధారంగా రైతుభరోసా ఇవ్వనుంది. అందుకు పూర్తిస్థాయిలో రికార్డులు సరిదిద్దడం కోసం తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం 2024-25లో ఎంఏవోలు పంపించిన రైతుల వివరాలు, పాత పట్టాదారులకు వివిధ కారణాలతో సాయం అందకుండా పోయిన డేటా, రైతుల సంఖ్య, డీబీటీ పద్ధతిన నగదు జమ కాని నాలుగు సీజన్లలోని పట్టాదారుల వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలను, రైతుల సంఖ్యను పంపించాలని కోరింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు సమర్పించిన పత్రాలు సరిగ్గా ఉండేలా క్షేత్రస్థాయి అధికారులు కసరత్తు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రైతు చనిపోతే రైతుబీమా సాయం అందిన వివరాల ప్రకారం వారి ఖాతాలకు రైతుభరోసాను నిలిపివేసేలా చర్యలు తీసుకోనున్నారు. రైతు చనిపోతే అతని పేరున భూమి పట్టామారిన తరువాతనే రైతుభరోసా కుటుంబ సభ్యులకు అందుతుంది.
ఉమ్మడి జిల్లాలో పట్టాదారులు, ఇతర వివరాలు ఇలా....
-------------------------------------------------------------------------------------------------------- జిల్లా 2024-25 కొత్త డీబీటీ లోపాలతో వివరాలు ఇవ్వని రైతుభరోసా మొత్తం
సరైన డేటా పట్టాదారులు భరోసా రాని రైతులు రైతులు నిలిచిన రైతులు పట్టాదారులు
---------------------------------------------------------------------------------------------------------------------------------------------
నల్లగొండ 5,21,881 9,506 1,774 26,994 5,375 5,65,788
యాదాద్రి 2,51,074 5,091 753 24,584 2,665 2,84,250
సూర్యాపేట 28,442 5,043 903 13,392 2,914 3,06,760
మొత్తం 8,01,397 19,640 3,480 64,970 10,954 11,56,800
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
సమగ్ర వివరాలు ప్రభుత్వానికి అందిస్తాం
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతుల సమగ్ర వివరాలను అందజేస్తాం. వానాకాలం సీజనలో రైతుభరోసాను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం వివరాలు పంపాలని ఆదేశించింది. గతంలో ఉన్న డేటాను ఆధారంగా చేసుకొని కొత్తగా నమోదు చేయాల్సిన వివరాలను సేకరించడం, ఖాతా నెంబర్ల పొరపాట్లను సరిదిద్దడం వంటివి చేస్తాం. గతంలో సాంకేతిక సమస్యలతో సాయం అందని వారు రైతులు వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకురావాలి. కొంతమంది రైతులు ఖాతా నెంబర్లను సరిగ్గా అందజేయకపోతే భరోసా అందడం కష్టమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ అధికారులు అడిగిన ప్రతి వివరాలను సమగ్రంగా అందించాలి. ఖాతా నెంబర్ తప్పుగా ఉండకుండా చూసుకోవడంతో పాటు అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించి రైతుభరోసాను పొంది వ్యవసాయానికి పెట్టుబడిని ఉపయోగించుకోవాలి.
-పి.శ్రవణ్కుమార్, నల్లగొండ జేడీఏ