Share News

ఏరువాక సాగుకు రైతన్న

ABN , Publish Date - Jun 12 , 2025 | 12:34 AM

ఏరువాక పౌర్ణమి ఉత్సవాలను మేళ్లచెర్వు మండలకేంద్రంలో రైతులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను రైతులు ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవటం ఇక్కడి ప్రత్యేకత. దీనిని తొలి పండుగగా రైతులు భావిస్తారు.

ఏరువాక సాగుకు రైతన్న
మేళ్లచెర్వు మండల కేంద్రంలో ఏరువాక సాగుకు కాడెద్దులతో ఊరేగింపుగా వెళ్తున్న రైతులు

మేళ్లచెర్వు/ ఆత్మకూరు(ఎస్‌), జూన 11 (ఆంధ్రజ్యోతి): ఏరువాక పౌర్ణమి ఉత్సవాలను మేళ్లచెర్వు మండలకేంద్రంలో రైతులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను రైతులు ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవటం ఇక్కడి ప్రత్యేకత. దీనిని తొలి పండుగగా రైతులు భావిస్తారు. కాడెద్దులను శుభ్రం చేసి ఎద్దు కొమ్ములకు రంగులు వేసి, ముస్తాబు చేసి ట్రాక్టర్లను ప్రత్యేకంగా అలంకరించారు. కాడిమానుకు, అరకకు పసుపు, కుంకుమలు పెట్టి, కంకణాలు కట్టి, అరకలు కట్టారు. గ్రామ వీధుల్లో మేళతాళాలతో ఊరేగింపుగా బయలుదేరి ఏరువాక గణపయ్య, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఎవరి పొలానికి వారు దున్నకాలకు వెళ్లారు. ఆత్మకూరు(ఎస్‌) మండలం నెమ్మికల్‌ గ్రామంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ చైర్మన కొప్పుల వేణారెడ్డి, మాజీ ఎంపీపీ వీరన్న, అబీ, పచ్చిపాల వెంకన్న, మాణిక్యం, కర్ణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 12:34 AM