అర్చక, ఉద్యోగులకు వరాల జల్లు
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:42 AM
రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగులకు, దూపదీప నైవేద్య అర్చకులకు వరాల జల్లు కురిపించింది. సుదీర్ఘకాలంగా సేవ లు అందిస్తున్న అర్చక, ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేసి పలు సంక్షేమ పథకాలను అమ లు చేయనుంది.

గ్రాట్యుటీ రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంపు
500మంది డీడీఎన్ఎ్స, 250మంది దేవాదాయ అర్చకులు,ఉద్యోగులకు ప్రయోజనం
(ఆంధ్రజ్యోతి-నల్లగొండ) : రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగులకు, దూపదీప నైవేద్య అర్చకులకు వరాల జల్లు కురిపించింది. సుదీర్ఘకాలంగా సేవ లు అందిస్తున్న అర్చక, ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేసి పలు సంక్షేమ పథకాలను అమ లు చేయనుంది. గత ప్రభుత్వం ట్రస్ట్ను ఏర్పాటు చేసినప్పటికీ నిధులు సమకూర్చలేదు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రకటించింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అర్చక సంక్షేమ నిధి ద్వారా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 250మంది అర్చకులు, 500 మంది దూపదీప నైవేద్య అర్చకుల సంక్షేమ నిధితో లబ్ధి చేకూరనుంది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సుదీర్ఘకాలంగా తమ సంక్షేమం కోసం ఎదురుచూస్తున్న అర్చక ఉద్యోగులకు ఊరట కలిగిందని చెప్పవచ్చు. అర్చకులు, ఉద్యోగులపై ఆధారపడి న ఎంతో మంది కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఎంతగానో ప్రయోజనం చేకూర్చే విధంగా ఉన్నాయి.
అర్చక ఉద్యోగులు, డీడీఎన్ఎ్సలకు ప్రయోజనం ఇలా..
ప్రభుత్వం గ్రాట్యూటీ రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది. అదేవిధంగా అర్చకులు, ఉద్యోగులకు మరణాంతరం, రిటైర్మెంట్ గ్రాట్యుటీ గ్రాంట్ రూపంలో 20 ఏళ్లు సేవలు అందించిన వారికి రూ.8లక్షల వరకు, 15 ఏళ్లు సేవలు అందించిన వారికి రూ.6లక్షలు, 10 ఏళ్లు సేవలు అందించిన వారికి రూ.4లక్షలు, 10 ఏళ్లు సర్వీస్ పూర్తికాక ముందే మరణిస్తే రూ.2లక్షల గ్రాట్యూటీ రూపంలో చెల్లించనున్నారు. డీడీఎన్ అర్చకుల కు మరణాంతరం గ్రాంట్ రూపంలో 20 ఏళ్లు సేవలు అందించిన వారికి రూ.4లక్షలు, 15ఏళ్లు అందించిన వారికి రూ.3లక్షలు, 10 ఏళ్లు సేవలు అందించిన వారికి రూ.2లక్షలు, 10 ఏళ్లు పూర్తికాక ముందే చనిపోతే రూ.లక్ష గ్రాంట్ చెల్లించనున్నారు. మెడికల్ బోర్డు సిఫార్సు చేసిన ప్రకారంగా రూ.2లక్షల వరకు మెడికల్ రీయింబర్స్మెంట్ గ్రాంట్ ఇవ్వనున్నారు. డీడీఎన్ ఉద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష116లు, రెగ్యూలర్ ఉద్యోగులకు రూ.2 లక్షలు రుణం ఇవ్వనున్నారు. ఉపనయనం గ్రాంట్ రూ.50వేలు, మరణాంతరం రూ.50వేలు, అంతిమ సంస్కారాలకు రూ.30వేలు చెల్లించనున్నారు. ఇంటి నిర్మాణానికి రెగ్యూలర్ ఉద్యోగులకు కన్సాలిడెంట్, డీడీఎన్ఎ్స అర్చకులకు రూ.50వేల గ్రాంట్, రెగ్యూలర్ ఉద్యోగులకు రుణం కింద రూ.10లక్షలు బ్యాంకు నుంచి పొందిన రుణం నుంచి వడ్డీ మొత్తం 10 ఏళ్ల వరకు ఏడబ్ల్యూఎ్ఫటీ నుంచి చెల్లించనున్నారు. ఇంటి మరమ్మతు కోసం డీటీఎన్ అర్చకులకు రూ.30వేలు, రెగ్యూలర్ ఉద్యోగులకు రూ.4లక్షలు, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్డీలకు ప్రతి విద్యా సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.35వేలు, డీడీఎన్ అర్చకులకు, రెగ్యూలర్ ఉద్యోగులకు రూ.5లక్షలు ఇవ్వనున్నారు. దివ్యాంగులైన ఉద్యోగులకు ఆర్థిక సాయం కింద 5 నుంచి 10 ఏళ్లు సేవలు అందించిన వారికి రూ.లక్ష, 10 ఏళ్లకు పైనా సేవలందిస్తే రూ.2లక్షలు ఆర్థికసాయం అందించనున్నారు.
ప్రభుత్వం అర్చకుల సంక్షేమానికి కృషి : వాసుదేవశర్మ, డీడీఎన్ఎ్స రాష్ట్ర అధ్యక్షుడు.
అర్చకులు సంక్షేమ ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అర్చకుల కోసం సంక్షేమ పథకాలను అమలుచేయడం హర్షించదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వం నిధి ట్రస్టు ద్వారా విద్య, వైద్యం, వివాహ, ఉపనయనం, దహన సంస్కారాలకు, దివ్యాంగులైన అర్చకులకు ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయం. మారుతున్న కాలానుగుణంగా ఆర్థికస్థితిని మెరుగుపర్చడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో యావత్ అర్చక సమాజం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి, ఇతర రాష్ట్ర మంత్రులు, దేవదాయ శాఖ అధికారులు చేసిన కృషితో ప్రయోజనం చేకూరింది.