Hyderabad: మాతృభాషతో.. మరింత అందంగా..
ABN , Publish Date - May 21 , 2025 | 04:23 AM
ప్రపంచ మిస్ వరల్డ్ పోటీల్లో సుందరీమణులు తమ మాతృభాషలో ప్రసంగించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హైదరాబాదులో టీ-హబ్లో జరిగిన ‘హెడ్ 2 హెడ్’ పోటీతో పాటు కిమ్స్ ఆస్పత్రి సందర్శన కార్యక్రమాలు కూడా జరిగాయి.

సొంత భాషలో ప్రసంగించిన. మిస్వరల్డ్ సుందరీమణులు
ప్రత్యేక అనువాదకులతో టీ-హబ్లో కార్యక్రమం
‘నమస్తే ఇండియా’ అంటూ తొలి పలుకు.. కిమ్స్ ఆస్పత్రి సందర్శన
నేడు శిల్పారామంలో సందడి
‘ఎలిమినేషన్’ ప్రక్రియ ప్రారంభం
6 విభాగాల్లో పోటీలు
ప్రతిభ ఆధారంగా 1 నుంచి 107 వరకు ర్యాంకులు
టాప్ 40లో ఉన్నవారు చివరి వరకు పోటీలో..
మిగతావారు ఔట్
హైదరాబాద్/సికింద్రాబాద్/హైదరాబాద్ సిటీ, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులు కొందరు తమ మాతృభాషలో అందంగా ప్రసంగించారు. అందరికీ తెలిసిన ఇంగ్లీష్ కాదని.. కొద్దిమందే మాట్లాడే తమ సొంత భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు. పోటీదారుల్లో ప్రతిభను గుర్తించేందుకు ఉద్దేశించిన ‘హెడ్ 2 హెడ్’ పోటీలు మంగళవారం టీ-హబ్లో ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రతి పోటీదారుకు కేటాయించిన 4 నిమిషాల సమయంలో తాము ఎంచుకున్న ‘సేవా కార్యక్రమం (బ్యూటీ విత్ పర్పస్)’ గురించి వివరించాల్సి ఉంటుంది. తొలిరోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన పోటీలో మూడు ఖండాలకు చెందిన 50 మంది పాల్గొన్నారు. వీరిలో 8 మంది తమ మాతృభాషలో ప్రసంగించారు. ‘నా భాష.. నా గుర్తింపు.. నా ఆత్మాభిమానం.. నా ప్రజల భాషను నేడు ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందంటూ మాట్లాడారు. బొలీవియాలో స్పానిషుతోపాటు మరో 12 స్థానిక భాషలు మాట్లాడతారు. అయితే మిస్ వరల్డ్ బొలీవియా ఓల్గా కావేజ్ అందులో అతి తక్కువ మంది మాట్లాడే స్థానిక భాషలో ప్రసంగించారు. నికరాగ్వా సుందరి వర్మానియా రోడ్రిగజ్ తన మాతృభాష ‘మిస్కిటో’లో మాట్లాడారు. ఇలా మాతృభాషలో ప్రసంగించే విషయాన్ని వారు ముందుగా నిర్వాహకులకు తెలపడంతో.. అనువాదకులను ఏర్పాటు చేశారు. మంగళవారం ప్రసంగించిన 50 మందిలో చాలా మంది ‘నమస్తే ఇండియా’ అంటూ ప్రాంభించడం గమనార్హం. ‘బ్యూటీ విత్ పర్పస్’ కార్యక్రమంలో భాగంగా పోటీదారులు తమ సామాజిక సేవ ఆలోచనలను పంచుకున్నారు.
అందమైన ఆలోచనలతో సేవ దిశగా..
2024 యూనిసెఫ్ నివేదిక ప్రకారం అర్జెంటీనాలో 70లక్షల మంది చిన్నారులు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. వారిలో 15 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు.. వారికోసం ప్రత్యేక ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవ చేస్తున్నట్టు అర్జెంటీనా సుందరి తెలిపారు.
తమ దేశంలో కాలేయ, కిడ్నీ సంబంధిత మరణాలు ఎక్కువని.. ఆ సమస్యల బారినపడకుండా అవగాహన కల్పిస్తున్నానని బొలీవియా సుందరి చెప్పారు.
‘విప్లవాలు ఆయుధాలతో కాదు పెన్ను, పుస్తకాలతో వస్తాయని నమ్ముతా. అందుకే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నా. 16 ఏళ్ల వయసు నుంచే వలంటీర్గా సేవలు అందిస్తున్నా’ అని బ్రెజిల్ ప్రతినిధి జెస్సికా పిద్రోజ్ చెప్పారు.
మెక్సికో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లేక యువత నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారని.. చిన్నచిన్న విషయాల్లో జరిగే ఘర్షణల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని.. ఈ పరిస్థితిని మార్చేందుకు యువతకు కౌన్సెలింగ్ అందిస్తున్నానని మెక్సికో సుందరి తెలిపారు.
తాను ఒకప్పుడు బార్ డ్యాన్సర్ అని, తర్వాత అందులోంచి బయటపడ్డానని కేమెన్ ఐలాండ్స్కు చెందిన జెడా రమూన్ చెప్పారు. తన దేశ మహిళలకు తన జీవితం స్ఫూర్తిగా ఉండాలన్న లక్ష్యంతో పోటీల్లో పాల్గొంటున్నానని వివరించారు.
కిమ్స్ ఆస్పత్రికి అందాల భామలు
ప్రపంచ సుందరి పోటీలో ఉన్న సుందరీమణులు కొందరు మంగళవారం హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజె్సను పరిశీలించి.. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. కిమ్స్ ఆడిటోరియంలో ఆస్పత్రి వైద్య నిపుణులు, పీజీ, నర్సింగ్ విద్యార్థులతో మాట్లాడారు. కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే యావత్ కుటుంబం ఆరోగ్యంగా ఉన్నట్టేనని.. మహిళలు ఆరోగ్యంగా ఉండేలా కుటుంబ సభ్యులు చూసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు, డాక్టర్ రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.
పాతబస్తీ అగ్ని ప్రమాదం కలచివేసింది
పాతబస్తీ అగ్ని ప్రమాద సంఘటన కలచివేసిందని మిస్ వరల్డ్ కెనడా ఎమ్మా మారిసన్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు పెట్టారు. ‘‘ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం, అందులో 8 మంది చిన్నారులు ఉండటం మరింత బాధాకరం. మమ్మల్ని ఈ ప్రాంత వాసులు ఆత్మీయంగా ఆహ్వానించారు. ఇప్పుడు వారు తీవ్రవేదనలో ఉండటం చూసి తన గుండె బద్దలైంది’’ అని పేర్కొన్నారు.
శిల్పారామంలో సుందరాంగుల సందడి
ప్రపంచ సుందరి పోటీలో ఉన్న అందాల భామలు బుధవారం సాయంత్రం శిల్పారామంలో సందడి చేయనున్నారు. తెలంగాణ గ్రామీణ హస్తకళల ఉత్పత్తులు మృణ్మయపాత్రలు, బొమ్మలు, రంగవల్లులు, అల్లిక లు, బుట్టబొమ్మలు ఇతర ఉత్పత్తులను పరిశీలించనున్నారు.
మిస్ వరల్డ్లో ‘టాలెంట్ హంట్’!
ఇరవై రోజులుగా సాగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో కీలక దశ ప్రారంభమైంది. ఆడుతూ పాడుతూ, పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతూ సాగిన అందాల పోటీలు.. మంగళవారం నుంచి రసవత్తరంగా మారాయి. మొత్తం 6 విభాగాలు.. ఎత్తు, శరీర ఆకృతి ఆధారంగా గుర్తించే బ్యూటీ.. క్రీడల్లో ప్రతిభను చాటే స్పోర్ట్స్.. ఆకట్టుకునేలా ఫ్యాషన్.. వ్యాపార ఆలోచనలు తెలిపే బిజినెస్.. సామాజిక సేవ గురించి వివరించే హెడ్ 2 హెడ్.. అప్పటికప్పుడు ప్రశ్నలకు వెంటనే సమాధానాలు చెప్పాల్సిన ‘1 ఆన్ 1’ పోటీలు ఉంటాయి. ప్రతి పోటీలో ప్రతిభ ఆధారంగా 1 నుంచి 107 వరకు ర్యాంకులు ఇస్తారు. అన్ని విభాగాల్లో టాప్-40లో ఉన్నవారు చివరివరకు పోటీలో నిలుస్తారు. స్పోర్ట్లో టాప్-40 జాబితాను అంతర్గతంగా ఇప్పటికే ప్రకటించారు. హెడ్ 2 హెడ్ పోటీలు బుధవారం సాయంత్రం ముగుస్తాయి. ఇలా ఆరు విభాగాల్లో పోటీలు ముగిశాక.. టాప్-40 జాబితాను ప్రకటిస్తారు. తుది పోటీలు ఈనెల 31న జరగనున్నాయి.