Share News

Metro Expansion: మెట్రో రైలు ‘పార్ట్‌-బీ’ పరుగులు!

ABN , Publish Date - Jun 17 , 2025 | 05:00 AM

మెట్రో రైలు రెండో దశలో పార్ట్‌-బీ కింద ప్రతిపాదించిన నార్త్‌సిటీ, ఫ్యూచర్‌సిటీ కారిడార్ల పనులు వేగిరం కానున్నాయి.

Metro Expansion: మెట్రో రైలు ‘పార్ట్‌-బీ’ పరుగులు!

  • మూడు కారిడార్లకు రూ.19,579 కోట్లు

  • పాలనాపరమైన అనుమతులిచ్చిన సర్కారు

  • వేగంగా ఫ్యూచర్‌సిటీ, మేడ్చల్‌, శామీర్‌పేట్‌ మార్గాలు

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త వెంచర్‌గా ప్రాజెక్టు

  • పాతబస్తీ మెట్రో పనులకు రూ.125 కోట్లు విడుదల

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): మెట్రో రైలు రెండో దశలో పార్ట్‌-బీ కింద ప్రతిపాదించిన నార్త్‌సిటీ, ఫ్యూచర్‌సిటీ కారిడార్ల పనులు వేగిరం కానున్నాయి. మూడు మార్గాల్లో 86.1 కిలోమీటర్ల పనులకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలపగా.. ఈ కారిడార్లకు కేటాయించిన రూ.19,579 కోట్లకు ప్రభుత్వం సోమవారం పరిపాలనా అనుమతులు ఇస్తూ జీవో 113 జారీ చేసింది. దీంతో పనులు మరింత వేగంగా జరగనున్నాయి. హైదరాబాద్‌లో మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా పార్ట్‌-ఏ కింద ప్రతిపాదించిన 5 కారిడార్లలోని 76.4 కి.మీ.కు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం రూ.24,269 కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్‌ వెంచర్‌ (50:50)గా ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించాయి. ఇందులో రాష్ట్ర వాటా 30 శాతం, కేంద్ర వాటా 18 శాతం పోగా.. అంతర్జాతీయ బ్యాంకుల నుంచి 48 శాతం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో 4 శాతం నిధులు తీసుకొని పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం డీపీఆర్‌ కేంద్రం పరిశీలనలో ఉంది.


కిలోమీటరుకు రూ.227.39 కోట్లు!

పార్ట్‌-ఏ మాదిరిగానే పార్ట్‌-బీ కింద ప్రతిపాదించిన మూడు కారిడార్లను కూడా జాయింట్‌ వెంచర్‌గా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తాజాగా కేటాయించిన నిధులే దీనికి నిదర్శనం. కారిడార్‌-9 కింద శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు- ఫ్యూచర్‌సిటీ (స్కిల్స్‌ యూనివర్సిటీ) 39.6 కిలోమీటర్లు చేపడుతున్నారు. కారిడార్‌-10 కింద జేబీఎ్‌స-మేడ్చల్‌ (24.5 కి.మీ.), కారిడార్‌-11 కింద జేబీఎ్‌స-శామీర్‌పేట్‌ (22 కి.మీ.) నిర్మిస్తున్నారు. మొత్తం 86.1 కి.మీ.కు పాలనా అనుమతులు ఇచ్చారు. ఇందులో ఒక్కో కి.మీ.కు రూ.227.39 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్‌సిటీ మార్గంలో భూసేకరణ సమస్య లేకపోవడంతో ఖర్చు తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది. జేబీఎ్‌స-మేడ్చల్‌, జేబీఎ్‌స-శామీర్‌పేట్‌లో ఖర్చు పెరుగుతోందని అధికారులు తెలిపారు. పాలనా అనుమతులు రావడంతో మెట్రో రెండో దశ పనుల టెండర్‌ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంటుందని చెప్పారు.


కారిడార్లలో నిర్మాణం జరిగేదిలా..

జేబీఎ్‌స-మేడ్చల్‌లో 24.5 కి.మీ. మార్గం పూర్తి ఎలివేటెడ్‌ కారిడార్‌ (ఆకాశమార్గం)లో నిర్మించనున్నారు. జేబీఎ్‌స-శామీర్‌పేట్‌ కారిడార్‌లో 20.35 కి.మీ. వరకు ఎలివేటెడ్‌, 1.65 కి.మీ. భూగర్భంలో ఉండనుంది. హకీంపేట విమానాశ్రయం సమీపంలో భూగర్భ మార్గంలో ట్రాక్‌ ఉంటుందని అధికారులు తెలిపారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు- ఫ్యూచర్‌ సిటీ 39.6 కి.మీ.లో ఎయిర్‌పోర్టు నుంచి 1.5 కి.మీ. భూగర్భ మార్గంలో, 21 కి.మీ. ఎలివేటెడ్‌, 17 కి.మీ. భూమిపై ట్రాక్‌ ఉంటుందని వివరించారు.

Updated Date - Jun 17 , 2025 | 05:03 AM