Share News

Maoist Sudhakar: మావోయిస్టు అగ్రనేత సుధాకర్‌ ఎన్‌కౌంటర్‌

ABN , Publish Date - Jun 06 , 2025 | 03:24 AM

దళపతిని కోల్పోయి అసలే కష్టాల్లో పడిపోయిన మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Maoist Sudhakar: మావోయిస్టు అగ్రనేత సుధాకర్‌ ఎన్‌కౌంటర్‌

బీజాపూర్‌లోని నేషనల్‌ పార్క్‌ ప్రాంతంలో కాల్చివేత

  • దళపతి నంబాలను కోల్పోయిన నక్సల్స్‌కు మరో దెబ్బ

  • సుధాకర్‌ మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు, పొలిటికల్‌ స్కూలు ఇన్‌చార్జి

  • 2004లో ఆర్‌కేతో పాటు శాంతి చర్చలకు

  • స్వస్థలం ఏలూరు జిల్లా సత్యవోలు

  • ఆయుర్వేదం అభ్యసిస్తూ పోరు బాటలోకి

  • ఆంఽధ్రా, ఒడిశా, డీకేల్లో 40 ఏళ్ల జీవితం

  • సుధాకర్‌ తలపై రూ. కోటికిపైగా రివార్డు

  • ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్న అగ్రనేతలు బండి ప్రకాశ్‌, పాపారావు?

చింతూరు, ఏలూరు, చర్ల, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): దళపతిని కోల్పోయి అసలే కష్టాల్లో పడిపోయిన మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌‌గఢ్‌లో బీజాపూర్‌ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటరులో మరో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్‌ సుఽధాకర్‌ అలియాస్‌ గౌతమ్‌ (65) మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంతో 2004లో మావోయిస్టు పార్టీ జరిపిన చర్చల్లో ప్రతినిధిగా సుధాకర్‌ పాల్గొన్నారు. ఆ చర్చల అనంతరం దండకారణ్యం చేరుకుని అక్కడే తన కార్యకలాపాలు సాగిస్తున్నారు. నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో సుధాకర్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్‌, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు పాపారావు, ఇతర ముఖ్య నేతలు సంచరిస్తున్నారన్న సమాచారంతో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌, కోబ్రా దళాలు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో ఇరుపక్షాల నడుమ ఎదురుకాల్పులు జరిగాయని, కాల్పులు ఆగిన తర్వాత వెళ్లి చూడగా సుఽఽధాకర్‌ మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఏకే 47ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆయన తలపై ఛత్తీస్‌‌గఢ్‌లో రూ. 40 లక్షల రివార్డు ఉంది. ఏపీ, ఒడిశా తదితర రాష్ట్రాలు ప్రకటించిన వెలలను కూడా కలిపితే ఆయనపై రూ.కోటికి పైగానే రివార్డు ఉంది.


ఎవరీ సుధాకర్‌?

మావోయిస్టు పార్టీని నడిపిస్తున్న అగ్రనేతల్లో సుధాకర్‌ ఒకరు. రివల్యూషనరీ పొలిటికల్‌ స్కూల్‌, రీజినల్‌ బ్యూరోలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో (ఏవోబీ) మావోయిస్టు ఉద్యమానికి సుధాకర్‌ సుదీర్ఘకాలం నాయకత్వం వహించారు. ఎత్తుగడలు వేయడంలోనూ, ఉద్యమాన్ని విస్తృతపరచడంలోనూ ఆయనది అందెవేసిన చేయి అని పోలీసులు కూడా అంగీకరిస్తారు. ఆయన స్వగ్రామం ఏపీలోని ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు. సుధాకర్‌ది అత్యంత పేద కుటుంబం. చదువు కోసం విజయవాడ వెళ్లిన తన సోదరుడు తిరిగి గ్రామానికి రానే లేదని ఆనందరావు చెబుతున్నారు. 40 ఏళ్ల క్రితం విద్యార్థి దశలో రాడికల్‌ సంఘం వైపు సుధాకర్‌ ఆకర్షితులయ్యారు. విజయవాడలో ఆయుర్వేద కళాశాలలో చదువుతున్నప్పుడే ఉద్యమబాట పట్టారు. 2004లో అప్పుటి వై.ఎ్‌స.రాజశేఖర్‌ ప్రభుత్వం మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ, గణేశ్‌లతోపాటు సుధాకర్‌ అప్పుడు జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. చర్చల సందర్భంలో హైదరాబాద్‌లో కొంతకాలం బస చేశారు. అయితే, ఆ తర్వాత తిరిగి ఎప్పుడూ సుధాకర్‌ మైదాన ప్రాంతానికి రాలేదు. ప్రముఖ సినీ నటుడు కాకరాల కుమార్తెను ఉద్యమంలోనే పెళ్లి చేసుకున్నారు. కాగా, ఏపీకే చెందిన మరో నేత, మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మే 21న నారాయణపూర్‌-బీజాపూర్‌ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఇంతలోనే మావోయిస్టులు మరో ముఖ్య నాయకుడైన సుధాకర్‌ని కోల్పోయారు. ఈ ఎన్‌కౌంటరును తమ విజయంగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.


పట్టుకుని కాల్చేశారా?

సుధాకర్‌ ఎన్‌కౌంటరు పట్ల పౌర హక్కుల సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో సుధాకర్‌కు రెండంచెల భద్రత ఉంటుంది. ఒకవేళ ఎన్‌కౌంటర్‌ జరిగితే ఆయనతో పాటు ఉన్న అంగరక్షకులు కూడా మరణించే అవకాశం ఉంటుంది. కానీ ఘటనాస్థలంలో సుధాకర్‌ మృతదేహం మాత్రమే కనిపించింది. దీనిని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆయనను ఎక్కడో పట్టుకుని ఛత్తీ్‌సగఢ్‌కు తీసుకొచ్చి కాల్చేశారని ఆరోపిస్తున్నాయి. సుధాకర్‌ ఒంటిపై యూనిఫాం కాకుండా మామూలు చొక్కా ఉన్న విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. సుధాకర్‌ మరణంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - Jun 06 , 2025 | 03:24 AM