నిధుల్లేక నీరసిస్తూ...
ABN , Publish Date - Jun 12 , 2025 | 11:56 PM
షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతూనే ఉన్నది.

- పంచాయతీల్లో అవస్థలు పడుతున్న ప్రజలు, కార్యదర్శులు
- స్టేట్, సెంట్రల్ ఫైనాన్స్ నిధులు ఆగిపోయి సంవత్సరంన్నర..
- గ్రామాల్లో మౌలిక వసతులు లేక కుంటుపడిన పాలన
- పాలకవర్గాలు కొలువుదీరితేనే 16వ ఆర్థిక సంఘం నిధులు
- సొంత డబ్బులు ఖర్చుచేయలేక, నిధులు రాక చేతులెత్తేస్తున్న పరిస్థితి
మహబూబ్నగర్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతూనే ఉన్నది. గతేడాది జనవరిలో పంచాయతీల పాలకవర్గాల గడువు పూర్తికాగా అప్పటి నుంచి పంచాయతీల్లో ఇన్చార్జీల పాలన కొనసాగుతోంది. పాలకవర్గాలు ఉంటే మాత్రమే వచ్చే ఆర్థిక సంఘం నిధులు ఎప్పుడో నిలిచిపోయాయి. కనీస అవసరాలు తీరకపోవడంతో పంచాయతీల్లో పాలన కుంటుపడింది. సొంత డబ్బు ఖర్చుచేయలేక, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం సీజన్లో వ్యాధులు ఎక్కువగా ప్రబలే పరిస్థితి ఉంది. దీనికి పారిశుధ్య నిర్వహణ అత్యంత కీలకం. వాటికి నిధుల అవసరం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక్కో కార్యదర్శి ఏడాది కాలంగా రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు సొంతంగా ఖర్చు చేశారు. అందులో చిల్లిగవ్వ కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు. అయినప్పటికీ వారిపై పనిఒత్తిడితో పాటు ఆర్థిక ఒత్తిడి కూడా తీవ్రమవుతోంది. కేవలం మల్టిపుల్ వర్కర్ల వేతనాలు జీపీ అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోంది. మిగతా నిర్వహణ ఖర్చులు మాత్రం మంజూరు కావడం లేదు. కొత్తగా ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలు కొలువుదీరితేనే 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. పాలకవర్గాలు ఉన్న సమయంలో నిధులు రావడం ఆలస్యమైనా సర్పంచులు ముందుగా సొంత డబ్బు ఖర్చు చేసి తర్వాత తీసుకునేవారు. ఇప్పుడాపరిస్థితి లేదు. ఇంకా ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారనే విషయంలో స్పష్టత లేదు.
- స్టేట్, సెంట్రల్ అంతే....
పంచాయతీలకు సాధారణంగా వచ్చే నిధులు మూడు రకాలు. పన్నురూపంలో వసూలైన మొత్తాన్ని జనరల్ ఫండ్ ద్వారా ఖర్చు చేసుకోవడం, ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం నిధులు మంజూరు చేయడం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు రావడం వల్ల పంచాయతీల్లో పనులు జరుగుతాయి. అయితే 2023 మార్చి నుంచి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు మంజూరుకాలేదు. జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు నిధులను విడుదల చేస్తారు. ఒక్కో వ్యక్తికి సంవత్సరంలో రూ. 1680 చొప్పున అందజేయాల్సి ఉంటుంది. వనపర్తి జిల్లాలో ఎస్ఎఫ్సీ నుంచి రూ. 22.74 కోట్లు ఇప్పటివరకు నిధులు పెండింగ్లో ఉండగా, 16వ ఆర్థిక సంఘం నుంచి రూ. 21.49 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. గద్వాల జిల్లాలో 16వ ఆర్థిక సంఘం నుంచి రూ. 32 కోట్లు విడుదలకావాలి. స్టేట్ఫైనాన్స్ నుంచి రూ. 16 కోట్ల వరకు మ్యాచింగ్ గ్రాంటు పెండింగ్లో ఉన్నది. నారాయణపేట జిల్లాలో 2024 జూలై నుంచి రూ. 6.88 కోట్లను మాత్రమే ఎంపీడబ్ల్యూ వేతనాలు, సీసీ చార్జీలు, ఆపరేటర్ వేతనాలు, ట్రాక్టర్ల ఈఎంఐ చెల్లించడానికి జమ చేశారు. 16వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధులు పెండింగ్లోనే ఉన్నాయి. సర్పంచుల పదవీకాలం పూర్తయినప్పటి నుంచి నిధులు పెండింగ్లో పడిపోయాయి. ప్రతీ సంవత్సరం ఇచ్చే నిధులను ఐదు శాతం పెరగాల్సి ఉండగా పెండింగ్ నిధులే రాని పరిస్థితులు ఉన్నాయి. దీంతో గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయడం, సామగ్రి కొనుగోలు చేయడం, ట్రాక్టర్ డీజిల్, నిర్వహణ, వీధి దీపాలు, మంచినీటి నిర్వహణలో భాగంగా పైప్లైన్ లీకేజీలు, మోటార్ల మరమ్మతులు, కొత్త మోటార్లు తేవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాల ఖర్చు తడిసిమోపెడవుతోంది.
- పర్యవేక్షణ సరే పనులెలా...
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చెత్త సేకరణ సమాచారం తెలుసుకునేందుకు తీసుకువచ్చిన డైలీ శానిటేషన్ రిపోర్టు (డీఎస్ఆర్)యాప్ను డౌన్లోడ్ చేసుకునేందుకు పంచాయతీ కార్యదర్శులు ఎట్టకేలకు అంగీరించారు. ఈ మేరకు బుధవారం రాత్రి హైదరాబాద్లో పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులతో రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలోని 423 గ్రామ పంచాయతీలకు గాను 421 గ్రామ పంచాయతీలలో యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. కానీ నిధులే లేనప్పుడు ప్రతీ రోజు పారిశుధ్య పనులు ఎలా చేపట్టాలనే ఆందోళన కార్యదర్శులను వేధిస్తోంది. డీఎస్ఆర్ యాప్లో ఫేస్ రికగ్నైజ్ రిజిస్ట్రేషన్ యాప్ ప్రధానం. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న కార్యదర్శులు డీఎస్ఆర్ యాప్ మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకునేందుకు విముఖత చూపుతున్నారు. ఇప్పటివరకు తమ సొంత మొబైల్స్లో శానిటేషన్ రిపోర్ట్ను అప్లోడ్ చేశారు. డీఎస్ఆర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సమాచారం మొత్తం రాష్ట్ర స్థాయిఅధికారుల పర్యవేక్షణలో ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు.
- విధులు నిర్వహించలేక పోతున్నాం
గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విధులు నిర్వహించలేకపోతున్నాము. స్వచ్ఛదనం- పచ్ఛదనం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 50 వేలు, చిన్న గ్రామ పంచాయతీలకు రూ. 25 వేలు విడుదల చేశారు. ఆ తర్వాత నిధులులేక పంచాయతీలలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం కష్టంగా మారింది.
- నర్మద, పంచాయతీ కార్యదర్శి, దాచక్పల్లి, మహబూబ్నగర్
పాలక వర్గంలేక పనిభారం అధికం
గ్రామాలలో పాలక వర్గాలు లేకపోవడం వల్ల పంచాయతీ కార్యదర్శులపై అదనపు పని భారం పడుతోంది. ప్రభుత్వం గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదు. దీంతో పంచాయతీలు ఆర్థిక లేమితో కోట్టుమిట్టాడుతున్నాయి. గ్రామాలలోని ప్రజల ఒత్తిడి మేరకు అందిన చోట అప్పులు తెచ్చి పనులు చేపట్టాం. ఇకపై పనులు నిర్వహించే ఆర్థిక స్థోమత కార్యదర్శులకు లేదు. ప్రభుత్వం ఇప్పటికైన నిధులు విడుదల చేయాలి.
- శివప్రసాద్, జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు, మహబూబ్నగర్
డీజిల్కు డబ్బులు లేవు
- ఖాజామీర్, అధ్యక్షుడు, పంచాయతీ కార్యదర్శుల సంఘం, గద్వాల జిల్లా
గ్రామ పంచాయతీలలో డీజిల్ పోయడానికి డబ్బులులేక ట్రాక్టర్లను ఆపివేశాం. పరిస్థితి అధ్వానంగా ఉన్నది. ఆర్థికపరమైన పనులు చేయబోమని అధికారులకు చెప్పేశాం. వచ్చేది వర్షాకాలం పారిశుధ్య పనులకు నిధులు లేవు. పంచాయతీ కార్యదర్వులు వత్తిడిలో ఉన్నారు.