అన్నింట్లో కమీషన్తో రూ.కోట్లకు పడగలెత్తారు
ABN , Publish Date - Jun 13 , 2025 | 10:58 PM
సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్ల దోపీడీతో నడిగడ్డలో రైతులు విలవిలలాడుతున్నారని, అప్పులకు వడ్డీలు కట్టలేక భూములు కోల్పోగా ఆర్గనైజర్లు మాత్రం వందల ఎకరాలతో కోట్లకు పడగలెత్తారని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ముందు రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు.

- సీడ్ ఆర్గనైజర్లపై కమిషన్ ముందు మొరపెట్టుకున్న రైతులు
- విత్తనం, భూమిపై రైతులకు మాత్రమే హక్కులు
- వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి
- మోసాలపై వివరించిన కన్వీనర్ రంజిత్కుమార్
గద్వాల, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్ల దోపీడీతో నడిగడ్డలో రైతులు విలవిలలాడుతున్నారని, అప్పులకు వడ్డీలు కట్టలేక భూములు కోల్పోగా ఆర్గనైజర్లు మాత్రం వందల ఎకరాలతో కోట్లకు పడగలెత్తారని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ముందు రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. శుక్రవారం గద్వాల కలెక్టరేట్లో సీడ్పత్తి రైతులు, కంపెనీలు, ఆర్గనైజర్లతో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు సమావేశం అయ్యారు. సీడ్ విత్తనోత్పత్తిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్గనైజర్లు, కంపెనీల దోపిడీపై వారు అనేక అంశాలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా రైతులు పెద్దరాముడు, లవన్న, లక్ష్మన్, గోపాల్, ఆంజనేయులు, గోపాల్, కిష్టమ్మలు తమ బాధలను చెప్పుకొచ్చారు. చాలా ఏళ్ల నుంచి సీడ్ పత్తిని పండిస్తున్నామని, గత కొన్నేళ్ల నుంచి సీడ్ విత్తనాలు ఫెయిల్ అయ్యాయని ఆర్గనైజర్లు, కంపెనీలు ప్రకటించి మోసం చేస్తున్నాయని వివరించారు. వాళ్లు ఇచ్చే సీడ్లో 30ఽశాతం బెరుకు ఉంటుందని వెల్లడించారు. దానికి కూడా మేము పెట్టుబడి పెట్టి నష్టపోయామని వివరించారు.
విత్తనం భూమిపై రైతులకు మాత్రమే హక్కులు
విత్తనం, భూమిపై రైతులకు మాత్రమే హక్కులు ఉంటాయని త్వరలో కొత్తచట్టం ఈ మార్పులతో మీ ముందుకు వస్తుందని వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. పాలమూరు రైతులు కష్టజీవులు అని వారికి న్యాయం చేసేందుకు సీంఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని వివరించారు. విత్తనం చట్టాలు చాలా ఉన్నాయని వాటి ఆధారంగా అధికారులు అనేక మార్గదర్శకాలు ఇచ్చారని వివరించారు. అయితే 2014 నుంచి ఈ మార్గదర్శకాలను ఎవరు పాటించడం లేదని వివరించారు. అందుకే కంపెనీలు జీవోటీని తమకు అనుకూలంగా మార్చుకొని విత్తనాలు ఫెయిల్ అయినట్లు ప్రకటిస్తున్నాయని వివరించారు. కాగా అంతకు ముందు గద్వాల మండలం పుటాన్పల్లిలో సీడ్ పంటను పరిశీలించి రైతులతో వివరాలు తెలుసుకున్నారు.
40మంది ఆర్గనైజర్ల చేతిలో 40వేల రైతులు
గద్వాలలో సీడ్ మాఫియా పెరిగిపోయిందని 40మంది ఆర్గనైజర్ల చేతిలో 40వేల మంది రైతులు నలిగిపోతున్నారని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రంజిత్కుమార్ కమిషన్కు వివరించారు. దాదాపు రూ.1000 వెయ్యి కోట్ల నుంచి 1500కోట్ల వ్యాపారం జరుగుతుందని వివరించారు. వాళ్లే సీడ్ ఇస్తారు.. అప్పుడు ఇచ్చి వడ్డీని వసూళ్లు చేస్తారు. కంపెనీల నుంచి కమిషన్ తీసుకుంటారు.. జిన్నింగ్ మిల్లులో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తారని వివరించారు. గత కలెక్టర్లతో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని వివరించారు. రైతు సంఘం నాయకుడు వీవీ నర్సింహ, బీఆర్ఎస్ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, కుర్వ పల్లయ్య, సీపీఐ, సీపీఎం నాయకులు వెంకటస్వామి, ఆంజనేయులు కూడా కమిషన్ ముందు పలు అంశాలను వివరించారు.
ఫెయిల్ అయిన సీడ్ ఇవ్వడం లేదు: ఆర్గనైజర్లు
కంపెనీలు ఫెయిల్ అయిన సీడ్ను ఇవ్వడం లేదని సీడ్ ఆర్గనైజర్లు పటేల్ ప్రభాకర్రెడ్డి, రాఘవేందర్లు కమిషన్ దృషికి తెచ్చారు. దీని వలన మేము మోసం చేస్తున్నామని రైతులు తమపై అనుమానం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. అదేవిధంగా ఫెయిల్ అయిన తర్వాత మరోసారి రైతు ముందే జీవోటీ టెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి లోపాలతో తాము అందరి ముందు దోషిగా ఉండాల్సి వస్తుందని కమిషన్ దీనిపై ప్రభుత్వానికి సూచనలు చేయాలని వారు కోరారు.
రెండు వర్గాల మధ్య ఘర్షణ.. తోపులాట
సీడ్ పంటను పరిశీలించేందుకు కమిషన్ చైర్మన్ సభ్యులు పుట్టాన్పల్లిలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్కుమార్ తన అనుచరులు, రైతులతో కలిసి అక్కడికి వచ్చారు. ఆర్గనైజర్ల దోపిడీ అరికట్టి రైతులకు న్యాయం చేయాలనే స్లోగన్ ఇస్తూ వచ్చారు. కాంగ్రెస్లోని ఓ వర్గం నాయకులు విజయ్ను అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ కలగజేసుకొని కమిషన్ చైర్మన్తో మాట్లాడించారు. తిరిగి వెళ్లే సమయంలో ముందు గొడవ పడిన నాయకులు తిరిగి విజయ్కుమార్తో ఘర్షణ దిగారు. ఇరువర్గాలు తోసుకున్నారు. పోలీసులు కాంగ్రెస్లోని ఓ వర్గంను ముందుకు తీసుకెళ్లి పంపించారు. తర్వాత బీఆర్ఎస్ నాయకుడు విజయ్కుమార్ను బలవంతంగా వాహనం ఎక్కించి ధరూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత విజయ్తో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు.