అధికారి ఆలోచన.. అభాగ్యులకు ఆసరా..!
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:25 PM
ప్రజలకు సేవ చేయాలన్న మంచి మనసు ఉండాలే కానీ కష్టమైన పని కూడా సులువవుతుంది. ఒకపూట తనకు కష్టమనిపించినా, ఆ సహాయం ఎంతో మందికి ఆసరా అవుతుందంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది.

- మహబూబ్నగర్ కలెక్టర్ వినూత్న ఆలోచన
- వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రజావాణి
- అర్బన్ తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహణ
- ప్రతీ నెల మొదటి బుధవారం ఫిర్యాదుల స్వీకరణ
మహబూబ్నగర్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు సేవ చేయాలన్న మంచి మనసు ఉండాలే కానీ కష్టమైన పని కూడా సులువవుతుంది. ఒకపూట తనకు కష్టమనిపించినా, ఆ సహాయం ఎంతో మందికి ఆసరా అవుతుందంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది. అధికారి వద్దకు తాము వెళ్లడం కాదు.. తమ దగ్గరికే అధికారి వచ్చి సమస్యను పరిష్కరిస్తే ఆ అభాగ్యుల ఆనందం అంతా ఇంతా కాదు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిరబోయి ఇలాంటి కార్యక్రమానికే శ్రీకారం చుట్టారు. ప్రతీ సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ప్రతీ వారం 100 నుంచి 150 మంది బాధితులు వివిధ సమస్యలపై ఫిర్యాదులు సమర్పిస్తున్నారు. వారితో పాటు వారి వెంట వచ్చే సహాయకులతో కలిసి ప్రతీ వారం దాదాపు 600 నుంచి 800 మంది వస్తుంటారు. ఫిర్యాదుదారుల్లో వృద్ధులు, దివ్యాంగులు కూడా ఉంటారు. అంత మందిలో వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ఒక ఫిర్యాదు ఇచ్చేందుకు గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది. ఫిర్యాదుదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే తోపులాటలో వారు మరింత ఇబ్బంది పడుతూ ఉంటారు. నడవలేని స్థితిలో ఉన్న వారు ఎంతో కష్టపడి అధికారి వద్దకు చేరుకుంటుండటాన్ని స్వయంగా గమనించిన అధికారి చలించి పోయారు. కలెక్టర్ మనసు కరిగిపోయింది. వారి కోసం ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావించారు. కొందరు సీనియర్లను పిలిపించుకుని చర్చించారు. అప్పుడే ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. ప్రతీ సోమవారం ప్రజావాణిలో సాధారణ వ్యక్తుల నుంచి ఫిర్యాదులు తీసుకోవడంతో పాటు, ప్రతీ నెల మొదటి బుధవారం వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించారు. అలా బుధవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణికి 32 ఫిర్యాదులు వచ్చాయి.
అందరికి అనువైన ప్రాంతంలో ఏర్పాటు
కలెక్టరేట్ సమీకృత భవనం పట్టణానికి దూరంగా ఉంది. వృద్ధులు, దివ్యాంగులు అంత దూరం రావడం కష్టం. అందుకే అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతం కావాలని ఆలోచించారు. బస్టాండ్కు సమీపంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం అయితే బాగుంటుందని, కోర్టు కూడా పక్కనే ఉంటుందని నిర్ణయించుకున్నారు. ఆ కార్యాలయంలోనే ప్రతీ నెల మొదటి బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కలెక్టర్తోపాటు ఆయా శాఖల అధికారులు బాధితుల ఫిర్యాదులను స్వీకరించి, సమస్యలను తెలుసుకొని నోట్ చేసుకుంటున్నారు. ఇలా నెలలో ఓ రోజు అభాగ్యులకోసం కలెక్టర్ సమయం వెచ్చిస్తున్నారు.
ఆనందం వ్యక్తం చేస్తున్న బాధితులు
రాష్ట్రంలోనే ఈ వినూత్న కార్యక్రమాన్ని మహబూబ్నగర్ కలెక్టర్ అమలు చేస్తున్నారు. తాము ఎన్నో వ్యయ, ప్రయాసాలకు ఓర్చి అధికారి వద్దకు వెళ్ళి గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేదని వారు చెప్తున్నారు. ఇప్పుడు తమ వద్దకే అధికారి రావడం, తక్కువ మంది ఉండటం వల్ల తోపులాటలు లేకుండా వినతులు ఇచ్చేందుకు అనువైన వాతావరణం కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారికి తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎక్కువ సమయం ఇవ్వడంతో పాటు, ప్రత్యేక ప్రజావాణి కావడంతో సమస్య కూడా త్వరగా పరిష్కారం అవుతుందని బాధితులు చెప్తున్నారు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే సంబంధిత అధికారి వివరాలను బుక్లో నమోదు చేసుకోవడం బాధితులకు ఊరటనిస్తోంది. అయితే కన్న కొడుకులు తమను పట్టించుకోవడం లేదని ఎక్కువ మంది వృద్ధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తుండటం గమనార్హం.
ఫిర్యాదుల పరిష్కారంపై ఆరా
కలెక్టర్ విజయేందిరబోయి ప్రజావాణికి వచ్చిన వెంటనే గత నెలలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? వాటిలో ఎన్ని పరిష్కారం అయ్యాయి? పరిష్కారం కాకపోతే అందుకు కారణాలు ఏంటి తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలికమైన సమస్యలను మినహాయి, మిగిలిన వాటిని అప్పటికప్పుడే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
చాలా మంచి కార్యక్రమం
కలెక్టర్ ఆలోచన అద్భుతం. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి ఏర్పాటు చాలా మంచి కార్యక్రమం. అందరికీ అనువైన ప్రాంతంలో ప్రజావాణి నిర్వహించడం, కలెక్టర్ సమయాన్ని వెచ్చించి బాధితుల వద్దకు వచ్చి వినతులు స్వీకరించడం గొప్ప విషయం. ఈ కార్యక్రమంతో సమస్య కూడా త్వరగా పరిష్కారం అవుతుంది.
- జగపతిరావు, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు
అధికారిని తొందరగా కలిశాం
వృద్ధులు, దివ్యాంగుల కోసమే ప్రత్యేక ప్రజావాణి ఏర్పాటు చేయడంతో, వెంటనే అధికారిని కలిసే అవకాశం లభించింది. ఫిర్యాదుదారులు తక్కువ మంది ఉండటంతో అధికారులతో ఎక్కువ సమయం మాట్లాడే సమయం ఉంటోంది. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. నేను బ్రెయిన్ట్రి ట్రై సైకిల్ కోసం వచ్చాను.
-శిరోమణి, భూత్పూర్