ఘనంగా ఏరువాక పౌర్ణమి
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:27 PM
జిల్లా వ్యాప్తంగా ఏరువాక పౌర్ణమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.

కోయిలకొండ/రాజాపూర్/దేవరకద్ర/చిన్నచింతకుంట/గండీడ్/హన్వాడ/జడ్చర్ల/భూత్పూర్ జూన్ 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా ఏరువాక పౌర్ణమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎద్దులను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏరువాక పౌర్ణమి రోజు పూజలు నిర్వహించి పొలం పనులు మొదలు పెడితే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. కోయిలకొండ మండల కేంద్రంలోని ఆదిహనుమాన్ ఆలయం నుంచి గౌని వరకు ఎద్దుల బండ్ల ఊరేగింపు నిర్వహించి, ఏరువాక తాడును తెంపారు. రాజాపూర్ మండల కేంద్రంలోని హనుమన్ ఆలయంలో గ్రామస్థులు అఖండ భజన చేశారు. రాయపల్లిలో రైతులు చెరువు తూము వద్ద ప్రత్యేక పూజలు చేశారు. దేవరకద్ర, కౌకుంట్ల మండల కేంద్రాల్లోని ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఎద్దుల బండ్లలతో ఊరేగింపు నిర్వహించారు. ఏరువాక తాడును తెంచారు. మొదటి తాడు తెంచిన రైతుకు బహుమతి అందజేశారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలో మొదటి సారి బస్టాండు కూడలిలో ఏరువాక తాడును తెంచారు. గండీడ్ మండల కేంద్రంతో పాటు వెన్నాచేడ్, పెద్దవార్వల్, రుసుంపల్లి, సల్కర్పేట్ గ్రామాలతో పాటు హన్వాడ మండల కేంద్రంలో ఏరువాక తాడును తెంచారు. జడ్చర్ల పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆయంలో అర్చకుడు సుధీంద్రాచార్య ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణం నిర్వహించారు. భూత్పూర్ మండలం పోతులమడుగులో రైతులు కాడెద్దులతో తోరణాలు తెంచే కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన 12 మంది రైతులు కాడెద్దులను తీసుకొచ్చి పోటీల్లో పాల్గొన్నారు. ఎల్పుటి కృష్ణయ్య, చాకలి సత్తయ్య కాడెద్దులు తోరణం తాడును తెంచాయి.