Share News

సుడి చెరువుకు కాలుష్య గండం

ABN , Publish Date - Jun 12 , 2025 | 11:13 PM

మండలంలోని పాతమొల్గర గ్రామ శివారులో ఉన్న సుడి చెరువులో పరిశ్రల నుంచి వచ్చిన కాలుష్యపు నీటితో చెరువు కలుషితమైందని ఆయకట్టు రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

సుడి చెరువుకు కాలుష్య గండం
సుడి చెరువులో కులుషితమైన నీరు

- పరిశ్రమ నుంచి నేరుగా చెరువులోకి వ్యర్థ పదార్థాలు

- చనిపోతున్న చేపలు 8 ఆందోళనలో మత్స్యకారులు.. ఆయకట్టు రైతులు

భూత్పూర్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పాతమొల్గర గ్రామ శివారులో ఉన్న సుడి చెరువులో పరిశ్రల నుంచి వచ్చిన కాలుష్యపు నీటితో చెరువు కలుషితమైందని ఆయకట్టు రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో చేపలు మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఐదేళ్లుగా ఈ చెరువులో కలుషిత నీరు చేరుతోందని, ఈ విషయం పరిశ్రమల వారికి చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. చెరువు పైభాగంలో వెంకటేశ్వర ఇండ్రస్ట్రీ అనే పరిశ్రమ (పేపర్‌ తయారీ కంపెనీ) ఉంది. అయితే ఈ కంపెనీ నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను బయటికి వెళ్లి పోవడానికి ప్రత్యేక ట్యాంకు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ఆ నీటిని సుదూర ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా వ్యర్థ పదార్థాలను చెరువుకు వెళ్లె పాటు కాల్వలో వదిలేయడంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో రెండు రోజులుగా పాతమొల్గర గ్రామస్థులు చెరువు దగ్గర ఆందోళన చేపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్‌ శాఖ, మండల పరిషత్‌ అధికారులు ఈనెల 11న సుడి చెరువును సందర్శించారు. ఇరిగేషన్‌ శాఖ ఏఈ హరీశ్‌ వెంకటేశ్వర పరిశ్రమల మేనేజర్‌ వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను చెరువుల్లో వదలడం నేరమవుతుందని, వెంటనే నిలిపి వేయాలని సూచించారు. చెరువు కింద దాదాపుగా 800 ఎకరాల్లో రెండు పంటలు సాగవుతాయని, ఈ చెరువుకు కేఎల్‌ఐ కేనాల్‌ నుంచి గొలుసు కట్టు చెరువుల ద్వారా నీరు వస్తుందని రైతులు తెలిపిపారు. సంబందిత శాఖ జిల్లా స్థాయి ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన చేపడతామని పాతమొల్గర రైతులు, మత్స్యకారులు హెచ్చరిచారు.

Updated Date - Jun 12 , 2025 | 11:13 PM