ఏరు నిండేలా కరుణించు.. కరువు తీరేలా ఆశీర్వదించు
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:45 PM
వ్యవసాయ పనుల ఆరంభం సందర్భంగా జైష్టశుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించే ఏరువాక పండుగను పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.

- గ్రామ దేవతలకు రైతన్నల పూజలు
- జిల్లాలో ఘనంగా ఏరువాక పౌర్ణమి
గద్వాల టౌన్/మల్దకల్/ గట్టు, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ పనుల ఆరంభం సందర్భంగా జైష్టశుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించే ఏరువాక పండుగను పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా రైతు కుటుంబాలు ఎక్కువగా నివశించే గంటవీధి, బురదపేట, తెలుగుపేట, బీసీ కాలనీ, చింతలపేట, తదితర చోట్ల ఉత్సాహంగా పండుగ నిర్వహించుకున్నారు. పట్టణంలో గ్రామ దేవతలు సుంకులమ్మ, ఈదెమ్మ ఆలయాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పూజలు చేశారు. ఏరువాకను పురస్కరించుకుని పట్టణంలోని పలు రైతు కుటుంబాలు తమ కాడెద్దులను రంగులతో ముస్తాబు చేసి ఊరేగించారు.
తోరణాన్ని తెంచిన యువకులు
మల్దకల్లో ఏరువాక పౌర్ణమిని ప్రజలు, రైతులు ఘనంగా జరుపుకున్నారు. గ్రామ దేవతలు సుంకులమ్మ, మారెమ్మ, సవారమ్మకు మొక్కులు చెల్లించారు. సాయంత్రం స్వయంభువు లక్ష్మీవేంకటేశ్వర ఆలయం వద్ద రైతుల తమ ఎద్దులకు పూజలు చేసి, వ్యవసాయ పనులకు సిద్ధమయ్యారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఏరువాక తోరణాన్ని యువకులు ఉత్సాహంగా తెంపారు. అలాగే మండలంలో ఏరువాక పౌర్ణమిని ఘనంగా జరుపుకున్నారు.
ఎద్దుల ఊరేగింపు
గట్టు: మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామాల్లో గ్రామ దేవతలతో పాటు ఆలయాలలో పూజలు నిర్వహించి పిండి వంటలతో నైవేద్యాలు సమర్పించా రు. ఉదయం రైతుల ఎద్దులను శుభ్రంగా కడిగి వాటికి రంగులు అంటించి సుందరంగా తయారు చేసి గ్రామాలలో ఊరేగింపు నిర్వహించారు. డప్పులు కొడుతూ, బాణసంచా కాల్చుతూ, కేరింతలు కొడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కొన్ని గ్రామాల్లో ఎద్దులను గ్రామ చావిడి వరకు తీసుకెళ్లి తాండ్రం తెంపే పోటీలు నిర్వహించారు. ఈ ఊరేగింపు కంటే ముందు రైతులు తమ పొలాల్లో వ్యవసాయ పనులకు పూజలు చేశారు.