Minister Uttam Kumar:బీఆర్ఎస్ వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం
ABN , Publish Date - May 22 , 2025 | 06:39 AM
బీఆర్ఎస్ హయాంలో కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి వదిలిన 514 టీఎంసీల జలాల ఒప్పందాన్ని రద్దు చేసిందని తెలిపారు.

ఏపీకి 514టీఎంసీ వాటాను వదిలేస్తూ ఒప్పందం చేసుకున్నారు: మంత్రి ఉత్తమ్
మేళ్లచెర్వు/కోదాడ, మే 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ హయాంలో కృష్ణా నదీ జలాల పంపకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో కృష్ణా నదిపై నిర్మించే ఎత్తిపోతల పథకాలపై జిల్లా అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 813 టీఎంసీల వాటా ఉండగా, రాష్ట్రం విడిపోయాక బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు 299టీఎంసీలు చాలంటూ, ఏపీకి 514 టీఎంసీల వాటాను వదిలేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వంలో లిఖితపూర్వక ఒప్పందం చేసుకుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేటాయింపులను రద్దు చేసిందని చెప్పారు. విస్తీర్ణం, జనాభా ప్రాతిపదికన తెలంగాణకు కృష్ణా జలాల్లో 70% వాటాను కేటాయించాలని కృష్ణా ట్రైబ్యునల్ బోర్డు ఎదుట తెలంగాణ తరపున వాదనలను తానే స్వయంగా వినిపించినట్లు ఉత్తమ్ గుర్తు చేశారు. ఇక, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.38వేల కోట్లతో తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు మొదలుపెట్టగా, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దానిని రద్దు చేసి కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టు... ఆ పార్టీ పాలనలోనే కూలిపోయిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంతో రూ.62వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని, ఈ నిధులతో కృష్ణానదిపై బీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బీసీ, గోదావరి నదిపై దేవాదుల, సీతారామ ప్రాజెక్టులు పూర్తయ్యేవని చెప్పారు.