KCR: నిన్ను ఏమడిగారు.. నేనేం చెప్పాలి
ABN , Publish Date - Jun 10 , 2025 | 06:04 AM
కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన అనంతరం మాజీ మంత్రి హరీశ్రావు నేరుగా ఎర్రవెల్లిలోని ఫాంహౌస్కువెళ్లారు. సోమవారం సాయంత్రం ఫాంహౌస్కి వెళ్లిన హరీశ్.. అక్కడ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు.

హరీశ్తో కేసీఆర్ సమాలోచనలు
కాళేశ్వరం కమిషన్ విచారణ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫాంహౌస్కు హరీశ్
4 గంటల పాటు సుదీర్ఘ మంతనాలు
రేపు కమిషన్ ముందుకు కేసీఆర్
భారీగా పార్టీ శ్రేణుల సమీకరణ
హైదరాబాద్/సంగారెడ్డి, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన అనంతరం మాజీ మంత్రి హరీశ్రావు నేరుగా ఎర్రవెల్లిలోని ఫాంహౌస్కువెళ్లారు. సోమవారం సాయంత్రం ఫాంహౌస్కి వెళ్లిన హరీశ్.. అక్కడ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. రాత్రి 8 గంటల వరకూ (దాదాపు 4 గంటల పాటు) పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ భేటీలో కేటీఆర్, ప్రశాంత్రెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ‘విచారణలో ఏం అడిగారు? ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై ఏం చెప్పావు?’ అని కేసీఆర్ హరీశ్ను అడిగినట్లు సమాచారం. ఈ నెల 5న కమిషన్ ఎదుట హాజరైన ఈటల రాజేందర్ను అడిగిన ప్రశ్నలు.. తాజాగా హరీశ్ను అడిగిన ప్రశ్నలను బేరీజు వేసుకున్నట్లు తెలిసింది. కమిషన్ తనను దాదాపు 21 ప్రశ్నలు వేసిందని, అన్నింటికీ సమాధానం ఇచ్చానని హరీశ్ చెప్పారు. మౌఖిక జవాబులే కాకుండా.. తగిన ఆధారాలను కూడా అందజేసినట్లు ఆయన కేసీఆర్తో చెప్పారు. ఈటల, హరీశ్ను అడిగిన ప్రశ్నలను ఆరా తీసిన కేసీఆర్.. బుధవారం తనను ఏమేం అడుగుతారన్న దానిపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కమిషన్ అడిగే ప్రశ్నలు ఎలా ఉంటున్నాయి? జవాబు ఎలా చెప్పాలన్నదానిపై హరీశ్తో సమాలోచనలు చేసినట్లు సమాచారం. ప్రశ్నల్లో తికమకలు, ప్రశ్నల స్థాయి గురించి కేసీఆర్ లోతుగా అడిగినట్లు తెలిసింది. ఆ ప్రశ్నల ఆధారంగానే అన్ని విధాలుగా కేసీఆర్ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. కాళేశ్వరం విచారణ కమిషన్ తనకు నోటీసులు ఇచ్చిన నాటి నుంచి కేసీఆర్ ఇప్పటికే 5 సార్లు హరీశ్తో చర్చించారు. మరిన్ని విషయాలను నివృత్తి చేసుకునేందుకు ఇంజనీర్లతోనూ ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. బుధవారం (ఈ నెల 11న) ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణకు హాజరుకానున్నారు.
భారీగా గులాబీ శ్రేణుల సమీకరణ..
బుధవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి భారీ కాన్వాయ్తో కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకోవడం, అక్కడి నుంచి బీఆర్కే భవన్ వద్దకు రావడం.. అన్నీ ప్రత్యేకంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డితోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని పార్టీ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతోపాటు మాజీ ప్రజాప్రతినిధులకు కూడా తెలంగాణ భవన్ నుంచి సందేశం పంపినట్లు సమాచారం.