సమాజాన్ని కాపాడే ది కమ్యూనిస్టులే..
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:36 AM
దేశాన్ని కాపాడేది సైనికులైతే సమాజాన్ని కాపాడేది కమ్యూనిస్టులేనని.. దేశంలో ఎర్ర జెండా లేకుండా చేయడం ప్రధాని మోదీ కాదని సీపీఐ శాసనసభ పక్షనేత కూనంనేని సాంబశివరావు అన్నారు.

ఆపరేషన్ కాగార్ను వెంటనే నిలిపివేయాలి
సీపీఐ శాసనసభ పక్షనేత కూనంనేని సాంబశివరావు
జగిత్యాల అర్బన్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): దేశాన్ని కాపాడేది సైనికులైతే సమాజాన్ని కాపాడేది కమ్యూనిస్టులేనని.. దేశంలో ఎర్ర జెండా లేకుండా చేయడం ప్రధాని మోదీ కాదని సీపీఐ శాసనసభ పక్షనేత కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో సీపీఐ జిల్లా నాలుగో మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు హాజరై మాట్లాడారు. దేశం క్లిష్ఠ పరిస్థితుల్లో ఉందని దేశం అంతర్గత ప్రమాదంలో పడిందన్నారు. కమ్యూనిస్టులు బలపడితే దేశం బలపడుతుందన్నారు. ప్రజల కష్టానికి ప్రతిఫలం లభించడంలేదని, దేశ సంపద కొందరి చేతుల్లోనే ఉందని, అంబాని, ఆదాని టాటా, బిర్లా వంటి పెట్టుబడిదారుల గత్తాదిపత్యంలో ఉందని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ దళారుల కొమ్ము కాస్తున్నారన్నారు. 11 సంవత్సరాల పాలనలో దేశంలో పేదరికం పోయిందని కేవలం ఐదు శాతం మాత్రమే పేదలు ఉన్నారని ప్రపంచ బ్యాంక్ అంచనా వేయడం చూస్తుంటే ఇవి బూర్జువా పార్టీలకు కొమ్ము కాస్తున్నాయనే విషయం స్పష్టం అవుతుందన్నారు. పేదల కోసం జైలుకు వెళ్లిన చరిత్ర సీపీఐకి ఉందన్నారు. స్వరాజ్యం సిద్దించి 78 ఏళ్ళు అయినా ఇంక రేషన్ కార్డులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. మావోయిస్టులను చంపవద్దని ఆపరేషన్ కాగార్ను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో అన్నాదమ్ముల్లాగా కలిసి ఉంటున్న ప్రజలను మతం పేరుతో చిచ్చుపెట్టి బీజేపీ పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. దేశాన్ని కాపాడేది సైనికులైతే సమాజాన్ని కాపాడేది కమ్యూనిస్టులేనని అన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఉన్నారు.
దోపిడీ ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటది
జగిత్యాల (ఆంధ్రజ్యోతి): దోపిడీ ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సీపీఐ 4వ మహాసభకు ఆయన హాజరై, ప్రజాప్రదర్శన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అంతరాలులేని సమాజం కోసమే ఎర్రజెండా పుట్టిందన్నారు. దేశంలో మతోన్మాదం పెరిగిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కగార్ పేరుతో మావోయిస్టులను కాల్చిచంపుతున్నారని, ఈ దుశ్చర్యను తక్షణమే ఆపాలన్నారు. ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో సీపీఐ నాయకులు, కార్యకర్తలతో పాటు అనుబంధ సంఘాల బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు.