Kaleshwaram Pushkaralu: భక్తజన సంద్రం.. త్రివేణీ సంగమం
ABN , Publish Date - May 22 , 2025 | 06:58 AM
కాళేశ్వరం పుష్కరాల ఏడో రోజు లక్ష మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల రద్దీతో క్షేత్రం సంద్రంగా మారగా, వర్షం వల్ల తాత్కాలిక ఏర్పాట్లు బురదమయమయ్యాయి.

ఏడో రోజు లక్ష మందికిపైగా పుష్కర స్నానాలు
భూపాలపల్లి, మే 21(ఆంధ్రజ్యోతి): త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరం భక్తజన సంద్రంగా మారింది. సరస్వతీ నది పుష్కరాల ఏడో రోజు బుధవారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తాత్కాలిక బస్ స్టాండ్ నుంచి ఘాట్కు వెళ్ళేందుకు ఉచిత బస్సులను అందుబాటులో ఉంచారు. అదనపు పోలీస్ బలగాలతో అన్నారం క్రాస్ రోడ్డు నుంచి పుష్కర ఘాట్, తాత్కాలిక బస్స్టాండు వరకు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ, సాయంత్రం వర్షంతో రోడ్లన్నీ బురదమయమై భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వచ్చే నాలుగైదు రోజుల్లో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు, అదనపు పార్కింగ్ స్థలాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. వచ్చే రెండు మూడు రోజుల్లో ఇక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలను అప్రమత్తం చేశారు. బుధవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ఖరే దంపతులు అంతర్వాహినిలో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, కాళేశ్వరంలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొట్టింది. దీంతో కాళేశ్వరక్షేత్రం, పుష్కర ఘాట్ పరిసరాలు జలమయమయ్యాయి. తాత్కాలిక బస్టాండ్, పార్కింగ్ స్థలం, టెంట్ సిటీ, స్టాళ్లు బురదమయ్యాయి.