Share News

కేసీఆర్‌ చట్టాన్ని గౌరవిస్తారని భావిస్తున్నా: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

ABN , Publish Date - May 21 , 2025 | 04:00 AM

కాళేశ్వరం విచారణపై మంత్రి శ్రీధర్‌బాబు కేసీఆర్‌ చట్టాన్ని గౌరవిస్తారని విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌ కేసీఆర్‌ నిజాయితీ నిరూపించకపోతే కఠిన చర్యలు తీసుకునేలా హెచ్చరించారు.

కేసీఆర్‌ చట్టాన్ని గౌరవిస్తారని భావిస్తున్నా: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

  • పుష్కరాలకు బండి సంజయ్‌ నిధులు తేవాలి: శ్రీధర్‌బాబు

పెద్దపల్లి, మే 20 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, వ్యక్తిగత ద్వేషంతో ఎవరిపైనా కేసులు పెట్టే ప్రభుత్వం తమది కాదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా శివపల్లిలో శ్రీధర్‌బాబు విలేకరులతో చిట్‌చాట్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జరుగుతున్న విచారణలో కమిషన్‌ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిందని తెలిపారు. ఆయన చట్టాన్ని గౌరవిస్తారని భావిస్తున్నానని అన్నారు. కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలకు ప్రభుత్వం రూ.35 కోట్లు ఇచ్చిందని, పుష్కరాల నిర్వహణ గురించి విమర్శిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కూడా కేంద్రం నుంచి రూ.35 కోట్లు ఇప్పిస్తే బాగుంటుందని అన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి రూ.వెయ్యి కోట్లు తీసుకురావాలని కోరారు.

  • కేసీఆర్‌ నిజాయితీని నిరూపించుకోవాలి : అద్దంకి

హైదరాబాద్‌, మే 20(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కమిషన్‌ విచారణలో కేసీఆర్‌ నిజాయితీని నిరూపించుకుంటే పూల దండలు వేస్తామని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆనాటి సీఎం, నీటి పారుదల, ఆర్థిక మంత్రులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది కనుకే కేసీఆర్‌, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు కమిషన్‌ నోటీసులు జారీ చేసిందని తెలిపారు. తప్పు ఎవరు చేసినా జైలుకు వెళ్లాల్సిందేనని, కేసీఆర్‌, హరీశ్‌, ఈటలకు జైలుకు వెళ్లే అర్హతలూ ఉన్నాయని అన్నారు.

Updated Date - May 21 , 2025 | 04:00 AM