JNTU: బీటెక్లో ఇంటర్నల్ పరీక్షలకూ ఇంప్రూవ్మెంట్
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:12 AM
జేఎన్టీయూ వర్సిటీ అనుబంధ, అఫిలియేటెడ్ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈసారి బీటెక్ ఫస్టియర్లో చేరుతున్న విద్యార్థులకు జేఎన్టీయూ తీపికబురు చెప్పింది.

జేఎన్టీయూ ఆర్25 నిబంధనల్లో మార్పు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జేఎన్టీయూ వర్సిటీ అనుబంధ, అఫిలియేటెడ్ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈసారి బీటెక్ ఫస్టియర్లో చేరుతున్న విద్యార్థులకు జేఎన్టీయూ తీపికబురు చెప్పింది. ఇంటర్నల్ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరచుకునే వెసులుబాటు కల్పిస్తోంది. వర్సిటీ అకాడమిక్ అండ్ ప్లానింగ్ విభాగం కొత్తగా రూపొందించిన (ఆర్25) నిబంధనల్లో ఈ అంశాన్ని చేర్చారు.
గతంలో ఇంటర్నల్ పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే ఇంప్రూవ్మెంట్ అవకాశం లేకపోవడంతో ఏళ్ల తరబడి బ్యాక్లాగ్ సబ్జెక్టులను పూర్తి చేయలేకపోయేవారు. ఈ నేపథ్యంలో పూర్వవిద్యార్థుల నుంచి భారీగా అందిన విజ్ఞప్తుల మేరకు ఈ ఏడాది నుంచి అమల్లోకి తెచ్చే నిబంధనల్లో ఇంటర్నల్స్ ఇంప్రూవ్మెంట్ వెసులుబాటు కల్పించారు.