Thumala Nageswara Rao: ప్రతి గ్రామానికీ జయశంకర్ వర్సిటీ విత్తనాలు
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:12 AM
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి, పంటల దిగుబడి పెంచడమే లక్ష్యంగా ‘‘గ్రామగ్రామానికి జయశంకర్ వర్సిటీ నాణ్యమైన విత్తనం’’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూన్లో సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్న ఈ కార్యక్రమం ద్వారా 12 వేల గ్రామాల్లో 40 వేల మంది రైతులకు విత్తనాలు పంపిణీ చేయాలని ప్రణాళికలు రూపొందించారు

2,500-3,000 క్వింటాళ్ల పంపిణీకి ప్రణాళిక: తుమ్మల
ABN AndhraJyothy: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి, పంటల దిగుబడి పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ‘‘గ్రామగ్రామానికి జయశంకర్ వర్సిటీ నాణ్యమైన విత్తనం’’ పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. జూన్లో సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల గ్రామాల్లో 40 వేల మంది రైతులకు 2,500-3,000 వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేసేలా ప్రణాళికలు తయారుచేసినట్లు వెల్లడించారు. కొన్నేళ్లుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అనేక కొత్త వంగడాలను అభివృద్ధి చేశారని, వాటిలో ప్రాచుర్యం పొందిన వంగడాలను రైతులకు నేరుగా అందించడం ద్వారా పంటల దిగుబడి గణనీయంగా పెరుగుతుందన్నారు. కాగా, గత నెలలో అకాల వర్షాలు, వడగండ్ల వానతో 8,408 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదిక వచ్చిందని, ఆయా రైతులకు త్వరలోనే నష్ట పరిహారం చెల్లిస్తామని తుమ్మల తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కురిసిన చెదురుమదురు వర్షాలకు ప్రాథమికంగా 14,956 ఎకరాల్లో నష్టం జరిగినట్లు సమాచారం వచ్చిందని, రైతుల వారీగా సర్వే చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.