Share News

Jagitial Political Rivalry: జగిత్యాల కాంగ్రెస్‌లో రగడ

ABN , Publish Date - Jun 10 , 2025 | 06:38 AM

ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి వచ్చిన సందర్భంగా జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. లక్ష్మణ్‌కు శుభాకాంక్షలు చెబుతూ జగిత్యాలలో జీవన్‌రెడ్డి వర్గం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ వర్గం పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

 Jagitial Political Rivalry: జగిత్యాల కాంగ్రెస్‌లో రగడ

  • లక్ష్మణ్‌ను అభినందిస్తూ మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌ వర్గీయుల పోటాపోటీ ఫ్లెక్సీలు

  • సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి కోసం రాజీనామాలు

  • నియోజకవర్గానికి నేనే రాజు.. నేనే మంత్రి: ప్రేమ్‌ సాగర్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి వచ్చిన సందర్భంగా జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. లక్ష్మణ్‌కు శుభాకాంక్షలు చెబుతూ జగిత్యాలలో జీవన్‌రెడ్డి వర్గం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ వర్గం పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని తహసీల్‌ చౌరస్తా వద్ద జీవన్‌రెడ్డి వర్గానికి చెందిన టీపీసీసీ ప్రచార కమిటీ స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ ముంజాల రఘువీర్‌ గౌడ్‌ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ‘ఒరిజినల్‌ కాంగ్రెస్‌’ అని రాసుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే సంజయ్‌ వర్గీయులు మండిపడుతున్నారు. జీవన్‌రెడ్డి వర్గీయులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన సంజయ్‌ అనంతరం కాంగ్రె్‌సలో చేరారు. మరోవైపు, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి క్యాబినెట్‌లో చోటు దక్కకపోవడంతో నియోజకవర్గ నేతలు రాజీనామాల పర్వానికి తెరలేపారు. మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్లతో పాటు ఇతర నేతలు తమ పదవులకు రాజీనామా చేస్తూ ఓ లేఖ రాసి అందులో అందరి సంతకాలు చేశారు. రాజీనామా లేఖతో పీసీసీ అధ్యక్షుడిని కలిసేందుకు హైదరాబాద్‌ వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో మాట్లాడారు. వచ్చే క్యాబినెట్‌లోనైనా సుదర్శన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరారు. కాగా, ‘మంచిర్యాల నియోజకవర్గానికి నేనే రాజు.. నేనే మంత్రి’ అని ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావు అన్నారు. లక్షెట్టిపేటలో ఆయన మాట్లాడుతూ మంత్రి పదవి రాలేదని తాను బాధపడేది లేదని తెలిపారు. జిల్లాలో ఎవరికి మంత్రి పదవి వచ్చినా మంచిర్యాల నియోజకవర్గంలో తన నిర్ణయమే ఫైనల్‌ అని అన్నారు.కాగా, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి తగిన గుర్తింపు, ప్రాధాన్యం వచ్చేలా ప్రయత్నం చేస్తానని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. మంత్రివర్గంలో చోటు లభించక పోవడంతో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని బుజ్జగించేందుకు శ్రీఽధర్‌బాబుసోమవారం తొర్రూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. మల్‌రెడ్డికి తగిన గుర్తింపు లభించాలని తాను కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు.

Updated Date - Jun 10 , 2025 | 06:40 AM