Ponguleti: గుడి లేని ఊరు ఉంటుందేమో కానీ.. ఇందిరమ్మ ఇల్లులేని ఊరు ఉండదు: పొంగులేటి
ABN , Publish Date - Jun 12 , 2025 | 03:58 AM
గుడి లేని ఊరు ఉంటుందేమో కానీ.. ఏ గూడానికి, ఏ తండాకు, ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు మాత్రం ఉంటుందని, అది ఇందిరమ్మ ప్రభుత్వ గొప్పతనమని మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి అన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: సీతక్క
మలుగు, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): గుడి లేని ఊరు ఉంటుందేమో కానీ.. ఏ గూడానికి, ఏ తండాకు, ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు మాత్రం ఉంటుందని, అది ఇందిరమ్మ ప్రభుత్వ గొప్పతనమని మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి అన్నారు. బుధవారం ములుగు జిల్లాలో మంత్రి ధనసరి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులతో కలిసి మంత్రి పొంగులేటి పర్యటించారు. ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో ఇందిరమ్మ కాలనీని ప్రారంభించి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇళ్లు కట్టించినట్లు తెలిపారు.
రాష్ట్ర విభజన జరగకముందు కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రాంతంలో సుమారు 24.50 లక్షల ఇళ్లు కట్టించినట్లు పేర్కొన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన గత ప్రభుత్వం వాళ్ల సొంత ఇళ్లకు డబ్బులు ఖర్చు పెట్టారు కానీ.. పేదల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఇల్లు రాలేదని ఏ ఒక్క ఆడబిడ్డ బాధపడొద్దని, భవిష్యత్లో అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని అన్నారు. ములుగు మండలం ఇంచర్లలో మంత్రి మాట్లాడుతూ 1974లో ఇందిరమ్మ హయాంలో ఇంచర్లలో కాలనీ ఏర్పడిందని, ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి హయాంలో ఇక్కడ నూతన భవనాలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.