Hyderabad: ఆన్లైన్ డెలివరీ స్టోర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
ABN , Publish Date - Aug 01 , 2025 | 01:04 PM
హైదరాబాద్లో ఆన్లైన్ డెలివరీ స్టోర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఇన్స్టా మార్ట్, బిగ్ బాస్కెట్ ల స్టోర్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు గుర్తించారు.

హైదరాబాద్: నగరంలో ప్రముఖ ఆన్లైన్ డెలివరీ స్టోర్లపై ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఇన్స్టా మార్ట్, బిగ్ బాస్కెట్ వంటి డెలివరీ కంపెనీలకు చెందిన 27 స్టోర్లలో తనిఖీలు నిర్వహించి అనేక లోపాలను గుర్తించారు.
జీహెచ్ఎంసీకి వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా అధికారులు ఈ తనిఖీలను చేపట్టారు. ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసే వినియోగదారులకు నాసిరకం లేదా కాలం చెల్లిన ఉత్పత్తులు పంపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు 36 శాంపిళ్లను సేకరించి, పరీక్షల నిమిత్తం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కు పంపారు.
హైజీన్ పరిస్థితులు దారుణం
తనిఖీల్లో ఎక్కువగా స్టోర్స్ లో ఈగలు, దోమలు తిరుగుతుండటం, వంటగదులు, నిల్వ ప్రాంతాల్లో పరిశుభ్రత లేకపోవడం అంతేకాకుండా, స్టోర్స్ లో పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ పరీక్షల ఫలితాల ఆధారంగా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. నియమాలు పాటించని స్టోర్లపై కేసులు నమోదు చేసి, జరిమానాలు విధిస్తామన్నారు.
కాగా, ఇటివల కాలంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలపై వినియోగదారుల్లో నిరాశ పెరుగుతుంది. నాణ్యత, హైజీన్ లోపాలు ఉండటంపై అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని వినియోగదారులు కోరుతున్నారు.
Also Read:
రైళ్లలో లగేజీకి కూడా రూల్స్ ఉన్నాయి.. అప్రమత్తంగా ఉండండి
CAT 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పరీక్ష షెడ్యూల్ తెలుసుకోండి