Heavy Rains: 5 రోజుల పాటు భారీ వర్షాలు!
ABN , Publish Date - Jun 14 , 2025 | 03:32 AM
రాష్ట్ర వ్యాప్తంగా వరుణుడు ప్రభావం చూపిస్తున్నాడు. శుక్రవారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవగా.. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్..
జడ్చర్లలో 10.6 సెం.మీ వర్షం
మెదక్లో పిడుగుపాటుకు మహిళ మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): రాష్ట్ర వ్యాప్తంగా వరుణుడు ప్రభావం చూపిస్తున్నాడు. శుక్రవారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవగా.. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భూపాలపల్లి, ములుగు, భద్రా ద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇక మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా 10.6సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భువనగిరి జిల్లాలోని దత్తప్పగూడలో 7.8సెంటీమీటర్ల వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో ఈదురుగాలుల దెబ్బకు విద్యుత్ ట్రాన్స్పార్మర్లు, స్తంభాలు దెబ్బతిన్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా శుక్రవారం మోస్తారు వర్షాలు కురిశాయి. కాగా, పిడుగుపాటుకు గురై మెదక్ జిల్లా గూడురు గ్రామానికి చెందిన సత్తమ్మ(45) మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. జూరాల ప్రాజెక్టుకు 14వేలు, శ్రీశైలం ప్రాజెక్టుకు 18,444 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది.