High Court: బౌరంపేట్లో అక్రమ నిర్మాణాలు తొలగించండి
ABN , Publish Date - Jun 07 , 2025 | 03:28 AM
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలం బౌరంపేట్ గ్రామం సర్వే నంబర్ 345/పీ, 347/పీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని హెచ్ఎండీఏకు హైకోర్టు ఆదేశించింది.

వాటితో రక్షణ సంస్థలకు ముప్పు: హైకోర్టు
హైదరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలం బౌరంపేట్ గ్రామం సర్వే నంబర్ 345/పీ, 347/పీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని హెచ్ఎండీఏకు హైకోర్టు ఆదేశించింది. అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలతో రక్షణ శాఖకు చెందిన సంస్థలకు ముప్పు కలిగే అవకాశం ఉన్నందున చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. రక్షణ సంస్థలను ఆనుకొని ఉన్న భూమిలో సంబంధిత అధికారుల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసి) పొందకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు చేపట్టిన నిర్మాణాలను సవాల్ చేస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది.
ఈ పిటిషన్లపై జస్టిస్ టి. వినోద్కుమార్ ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్కుమార్ వాదనలు వినిపిస్తూ.. 2012 ఏప్రిల్ 7న మున్సిపల్ శాఖ జారీ చేసిన జీవో నంబర్ 168 ప్రకారం సంబంధిత రక్షణ శాఖ అధికారుల నుంచి ఎన్వోసీ పొందడం తప్పనిసరి అన్నారు. కానీ ఆ నిబంధనలను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2016లో జీవో నంబర్ 7ను జారీ చేసిందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. అక్రమ నిర్మాణాలు ఉంటే తొలగించాలని ఆదేశించింది.