Share News

Harish Rao: బనకచర్లపై ఉత్తమ్‌ మాటలు విడ్డూరం

ABN , Publish Date - Jun 07 , 2025 | 04:36 AM

ఏపీ అక్రమంగా నిర్మించాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్టుపై తాను స్టడీ చేయలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అది బాధ్యతారాహిత్యమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

Harish Rao: బనకచర్లపై ఉత్తమ్‌ మాటలు విడ్డూరం

  • స్టడీ చేయలేదనడం బాధ్యతారాహిత్యమే

  • చంద్రబాబు కనుసన్నల్లో కేంద్రమంత్రులు

  • బనకచర్లపై సుప్రీం కోర్టుకెళ్తాం: హరీశ్‌

దుబ్బాక/హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఏపీ అక్రమంగా నిర్మించాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్టుపై తాను స్టడీ చేయలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అది బాధ్యతారాహిత్యమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ గోదావరిలో వాటాను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఎమ్మెల్యే కొత్తప్రభాకర్‌రెడ్డి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర క్యాబినెట్‌ భేటీలో బనకచర్లపై మాట్లాడేందుకు మంత్రులకు సమయం లేదా..? ఐదుగంటల పాటు జరిగిన సమావేశంలో కమీషన్లు, పర్సంటేజీలు, హైకమాండ్‌కు పంపే మూటల గురించి మాట్లాడారా..? అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్‌కుమార్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ ఏపీ సీఎం చంద్రబాబుకు దాసోహం అయ్యారన్నారు.


రేవంత్‌రెడ్డి గురుదక్షణ చెల్లించుకుంటే, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా సతీసమేతంగా విజయవాడకు పోయి చంద్రబాబును కలిసి బజ్జిలు తినొచ్చారని వ్యాఖ్యానించారు. పదేళ్ల రాష్ట్ర చరిత్రలో కృష్ణా జలాల్లో తక్కువ నీటిని కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే వాడామని, కిందికి నీళ్లు వదిలి, ఆంధ్రాకు లాభం చేకూర్చి ఖమ్మం, నల్లగొండ జిల్లా రైతుల పంటలు ఎండబెట్టారని మండిపడ్డారు. చీటికిమాటికి ఒంటికాళ్లమీద లేచే బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు గోదావరి-బనకచర్ల మీద ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల శాశ్వతంగా తెలంగాణ తన నీటి వాటాను కోల్పోయో ప్రమాదం ఉందని, హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఏర్పడుతుందని తెలిపారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు చంద్రబాబు కనుసన్నల్లోనే మెదులుతున్నారని ఆరోపించారు. బనకర్లపై బీఆర్‌ఎస్‌ సుప్రీం కోర్టుకు వెళ్తుందని ఆయన చెప్పారు.


ఉద్యోగులకు కనీసం మూడు డీఏలైనా ఇవ్వాలి: బీఆర్‌ఎస్‌

కాంగ్రెస్‌ అధికారం చేపట్టి ఏడాదిన్నరకాలం గడిచినా.. ఎన్నికల హామీలను అమలు చేయడంలేదని, క్యాబినెట్‌ సమావేశంలోనూ.. దీనిపై చర్చించకపోవడం దుర్మార్గమని బీఆర్‌ఎస్‌ నేతలు అన్నారు. శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి, పార్టీ నేత జి.దేవీప్రసాద్‌ శుక్రవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోపై దాడి.. స్వల్ప గాయాలు

బనకచర్లపై ఘాటుగా స్పందించిన మంత్రి ఉత్తమ్

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 04:36 AM