Kondagattu: జైబజరంగభళి
ABN , Publish Date - May 23 , 2025 | 05:45 AM
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు.

కొండగట్టులో అంజన్న దీక్షాపరులు
కొండగట్టులో ప్రత్యేక అలంకారంలో ఆంజనేయస్వామి
రాష్ట్రంలో ఘనంగా హనుమాన్ జయంతి.. కొండగట్టు అంజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
మల్యాల, మే 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు లక్షన్నర మందికిపైగా భక్తులు అంజన్నను దర్శించుకున్నారని అంచనా. అంజన్న దీక్షాపరులతో కొండగట్టు క్షేత్రం కాషాయవర్ణాన్ని పులుముకుంది.
ప్రతియేటా వైశాఖ బహుళ దశమి సందర్భంగా నిర్వహించే పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని అంజన్న సన్నిధిలో స్వామివారికి తిరుమంజనం, ద్రావిడ ప్రబంధ పారాయణములు, విశేష అభిషేకం, తులసీ అర్చన, స్వామివారికి పట్టు వస్త్రాలంకరణ చేశారు. యాగశాలలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు త్రైయాహ్నిక, త్రికుండాత్మక యజ్ఞాలను ఘనంగా నిర్వహించారు. గురువారం మహా పూర్ణాహుతి, ఊయల సేవను వైభవంగా జరిపారు.